సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ గుంటూరు సీసీఎస్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నాటి నరసాపురం ఎంపీ, ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును సీఐడీ కస్టడీలో హింసించారన్న కేసులో సునీల్ కుమార్ ప్రధాన నిందితుడిగా (ఏ1) ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసుకు సంబంధించి అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. విజయనగరం ఎస్పీ దామోదర్ ఈ కేసులో విచారణాధికారిగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే సునీల్ కుమార్ విచారణ కొనసాగుతోంది. తొలుత డిసెంబర్ 4న విచారణకు రావాలని గత నెల 26న అధికారులు సునీల్ కుమార్కు తొలిసారి నోటీసులు జారీ చేశారు. అయితే, కుటుంబ సభ్యుల అనారోగ్య కారణాల రీత్యా తనకు గడువు కావాలని ఆయన కోరారు. ఆయన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న అధికారులు, డిసెంబర్ 15న తప్పనిసరిగా హాజరుకావాలని ఈ నెల 6న రెండోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సునీల్ కుమార్ ఇవాళ గుంటూరు సీసీఎస్ పోలీస్ స్టేషన్కు వచ్చి విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కు నేతృత్వం వహిస్తున్న ఎస్పీ దామోదర్ ఆయన్ను విచారిస్తున్నారు. రఘురామపై దాడికి ఎవరు ఆదేశాలు ఇచ్చారు, ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి ఆయనపై ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, ఇందులో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందన్న అంశాలపై పోలీసులు పీవీ సునీల్ ను ప్రశ్నిస్తున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos