నియోజకవర్గాల పునర్విభజన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. దేశంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ నియోజకవర్గాల పునర్విభజన చేసిన తర్వాతే ఎన్నికలు జరుగుతాయని కేంద్రం క్లారిటీ ఇస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన అనేది కేవలం భౌగోళిక సరిహద్దుల మార్పు మాత్రమే కాదు, అది రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేసే గేమ్ ఛేంజర్. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన, 2029 ఎన్నికల నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్న కేంద్ర ప్రభుత్వ యోచన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014లోని సెక్షన్ 26 ప్రకారం సీట్ల పెంపుదల అంశం మళ్లీ తెరపైకి రావడంతో, ఏ ప్రాంతానికి ఎన్ని సీట్లు వస్తాయి.. ఏ పార్టీకి లబ్ధి చేకూరుతుందనే విశ్లేషణలు మొదలయ్యాయి.
పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ స్థానాల సంఖ్య ప్రస్తుతం ఉన్న 175 నుండి 225కు, తెలంగాణలో 119 నుండి 153కు పెరగాల్సి ఉంది. అంటే ఏపీలో అదనంగా 50 స్థానాలు, తెలంగాణలో 34 స్థానాలు కొత్తగా రానున్నాయి. అయితే, రిపోర్టుల ప్రకారం ప్రతి రాష్ట్రంలో 50 శాతం మేర సీట్లు పెరిగే అవకాశం ఉందన్న సంకేతాలు వస్తున్నాయి. అదే జరిగితే ఏపీలో సీట్ల సంఖ్య 260 దాటవచ్చు, తెలంగాణలో 180కి చేరుకోవచ్చు. ఈ పెరుగుదల రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు నాంది కానుంది. ఏపీలో సీట్ల పెంపు ప్రాంతాల వారీగా తీవ్ర ప్రభావం చూపనుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో జనాభా సాంద్రత ఎక్కువగా ఉండటంతో, అక్కడ సీట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ముఖ్యంగా విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు వంటి నగరాల పరిధిలో కొత్త నియోజకవర్గాలు పుట్టుకొస్తాయి. దీనికి భిన్నంగా రాయలసీమలో జనాభా పెరుగుదల రేటు తక్కువగా ఉండటంతో, అక్కడ సీట్ల సంఖ్య ఆశించిన స్థాయిలో పెరగకపోవచ్చు. ఇది అసెంబ్లీలో రాయలసీమ ప్రాంతం యొక్క రాజకీయ బలాన్ని కొంత తగ్గించే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
సీట్ల సంఖ్య పెరగడం వల్ల రాజకీయ పార్టీల్లో కొత్త తలనొప్పులు మొదలవుతాయి. నియోజకవర్గాల పరిధి తగ్గడం వల్ల స్థానిక నాయకత్వం బలం పెరుగుతుంది. పెద్ద నియోజకవర్గాల్లో ఇద్దరు ముగ్గురు బలమైన నేతలు ఉన్న చోట, సీట్ల పెంపు వల్ల గ్రూపు తగాదాలు తగ్గే అవకాశం ఉన్నా, కొత్తగా ఏర్పడే స్థానాల్లో తమ వర్గాన్ని నిలబెట్టుకునేందుకు అగ్రనేతలు పోటీ పడతారు. అలాగే, మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తే, పెరిగిన సీట్లలో అధిక భాగం మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది. ఇది పురుష రాజకీయ నేతల ఆధిపత్యానికి గండి కొట్టే అంశం.
2011 జనాభాను ప్రాతిపదికగా తీసుకోవడం వల్ల జనాభా నియంత్రణ పాటించిన ప్రాంతాలకు అన్యాయం జరుగుతుందన్న ఆందోళన కూడా ఉంది. ఉదాహరణకు, అమరావతి లేదా విశాఖ వంటి ప్రాంతాల్లో గత దశాబ్ద కాలంలో జనాభా భారీగా పెరిగింది, కానీ 2011 లెక్కలనే వాడితే ఆ మార్పులు ప్రతిబింబించవు. అయినప్పటికీ, సీట్ల పెంపుదల వల్ల అసెంబ్లీలో ప్రజాప్రతినిధుల సంఖ్య పెరిగి, పాలన ప్రజలకు మరింత చేరువవుతుందన్నది సానుకూల అంశం. 2029 నాటికి జరగబోయే ఈ నియోజకవర్గాల పునర్విభజన తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త రాజకీయ శకానికి తెరతీయనుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రాంతీయ బలాబలాలు, సామాజిక సమీకరణాలు , పార్టీల వ్యూహాలు అన్నీ కలిపి అధికార పార్టీలకు అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని వారంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos