ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై శాసనమండలి మీడియా పాయింట్ వద్ద ప్రతిపక్ష నేత, వైసీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆత్మస్తుతి... పరనింద అన్నట్టు బడ్జెట్ ప్రసంగం సాగిందని విమర్శించారు. ఇది అంకెల గారడీతో కూడిన పసలేని బడ్జెట్ అని, ఇందులో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ పేర్లను పదిసార్లు ప్రస్తావించడం తప్ప ప్రజలకు మేలు చేసే అంశాలు ఏవీ లేవని ఆయన దుయ్యబట్టారు. ఈ బడ్జెట్ ప్రజల్లో ఉన్న కొద్దిపాటి ధైర్యాన్ని, స్థైర్యాన్ని కూడా దెబ్బతీసిందని, ఇది మోసపూరిత పత్రమని ఆయన అభివర్ణించారు. బడ్జెట్‌పై జరిగిన చర్చలో బొత్స మాట్లాడుతూ, ప్రతి రంగంలోనూ ప్రభుత్వం ప్రజలను వంచిస్తోందని ఆరోపించారు.

మహిళా సాధికారతపై ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని బొత్స తీవ్రంగా తప్పుపట్టారు. ప్రతి ఇంట్లో ఒక మహిళను పారిశ్రామికవేత్తగా తయారు చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. "గతంలో డ్వాక్రా సంఘాలను బలోపేతం చేసి, వారిలో పారిశ్రామిక స్ఫూర్తిని నింపడానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పావలా వడ్డీ పథకాన్ని తెచ్చారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు సున్నా వడ్డీని అమలు చేశాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్కరోజు కూడా ఆలస్యం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే సున్నా వడ్డీ డబ్బులు జమ అయ్యేవి. కానీ ఈ ప్రభుత్వం వచ్చి 19 నెలలైనా ఆ సున్నా వడ్డీ పథకం ఏమైందో తెలియదు. బడ్జెట్‌లో దానికి కేటాయింపులు లేవు. ఎలాంటి ఆర్థిక చేయూత లేకుండా మహిళలను పారిశ్రామికవేత్తలుగా ఎలా మారుస్తారో చంద్రబాబు చెప్పాలి. ఇది మహిళలను మోసం చేయడం కాదా?" అని బొత్స ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.

గ్రామీణాభివృద్ధి, ఉపాధి హామీ పథకం (NREGS) నిధుల కేటాయింపులోనూ ప్రభుత్వం కోత పెట్టిందని బొత్స ఆరోపించారు. "గతంలో ఉపాధి హామీ పథకం కింద 100 శాతం నిధులను కేంద్రమే భరించేది. ఇప్పుడు కేంద్రం నిబంధనలు మార్చి మెటీరియల్, లేబర్ కాంపోనెంట్లలో 40 శాతం వాటాను రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని చెప్పింది. గత ప్రభుత్వాల హయాంలో ఏటా సగటున రూ. 5,000 కోట్లు ఈ పథకం కింద ఖర్చు చేసేవారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం రాష్ట్రం కనీసం రూ. 2,000 కోట్లు కేటాయించాలి. కానీ బడ్జెట్‌లో కేవలం రూ. 500 కోట్లు మాత్రమే చూపించారు. మిగిలిన బ్యాలెన్స్ సంగతేంటి? అంటే ఈ పథకాన్ని కూడా నీరుగార్చబోతున్నారా?" అని ఆయన నిలదీశారు. రాష్ట్ర అప్పుల విషయంలోనూ ప్రభుత్వం వాస్తవాలను వక్రీకరిస్తోందని బొత్స ఆరోపించారు. రాష్ట్ర విభజన నుంచి వారసత్వంగా రూ. 9.46 లక్షల కోట్ల అప్పులు వచ్చాయని చెప్పడం సత్యదూరమని అన్నారు. 

"మా ఐదేళ్ల పాలనలో కార్పొరేషన్లతో కలిపి మేం చేసిన అప్పు కేవలం రూ. 3 లక్షల కోట్లు మాత్రమే. అంతకుముందున్న టీడీపీ ప్రభుత్వం రూ. 2.30 లక్షల కోట్ల అప్పు చేసింది. వాస్తవాలు ఇలా ఉంటే, అప్పుల భారాన్ని మాపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు" అని బొత్స వివరించారు. ఈ బడ్జెట్‌లో కేవలం ప్రగల్భాలు తప్ప, నిర్దిష్ట కేటాయింపులు, ప్రజలకు భరోసా ఇచ్చే అంశాలు ఏవీ లేవని విమర్శించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos