ఏపీలో మెడికల్ కాలేజీల వ్యవహారం కొత్త టర్న్ తీసుకుంది. కూటమి ప్రభుత్వం పీపీపీ విధానం లో మెడికల్ కాలేజీల నిర్మాణానికి నిర్ణయించింది. దీనిని వ్యతిరేకిస్తున్న వైసీపీ నిరసనలకు కొనసాగిస్తోంది. కోటి సంతకాలతో మాజీ సీఎం జగన్ నిన్న గురువారం సాయంత్రం గవర్నర్ ను కలిసారు. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ ఆగే వరకు పోరాటం సాగిస్తానని ప్రకటించారు. అదే సమయంలో జగన్ చేసిన హెచ్చరికలపై రాష్ట్ర మంత్రి సత్య కుమార్ సీరియస్ అయ్యారు. పీపీపీ తప్పయితే తనను అరెస్ట్ చేయాలని సవాల్ చేసారు. పీపీపీ అమలు చేస్తున్న వారిని అరెస్ట్ చేయగలవా అంటూ నిలదీసారు.
పీపీపీ విధానంలో చేపట్టే మెడికల్ కాలేజీల నిర్మాణంలో అక్రమాలకు పాల్పడిన వారందరినీ.. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే జైలుకు పంపు తామనడం జగన్ అహంకారానికి అద్దం పడుతోందని మంత్రి సత్య కుమార్ విమర్శించారు. పీపీపీ విధానం తప్పయితే... జగన్కు దమ్ముంటే... వైద్య శాఖ మంత్రిగా ఉన్న తనను ముందుగా జైలుకు పంపాలని మంత్రి సవాల్ విసిరారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం, పార్లమెంట్ స్థాయి సంఘం, నీతి ఆయోగ్, జాతీయ వైద్య మండలి, హైకోర్టు, సుప్రీంకోర్టు... అందరూ పీపీపీ విధానాన్ని సమర్థిస్తుంటే.. ప్రధాని మోదీతో సహా వీరందర్నీ జైలుకు పంపుతావా అంటూ కీలక వ్యాఖ్యలు చేసారు.
మెడికల్ కాలేజీలపై కోటి సంతకాల పత్రాలంటూ గవర్నర్నూ పక్కదారి పట్టిస్తున్నారని సత్య కుమార్ మండిపడ్డారు. వైసీపీ హయాంలో మెడికల్ కాలేజీలకు రూ.600 కోట్లు ఖర్చు పెట్టేలా ఉత్తర్వులిచ్చి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అవన్నీ బయటకు వస్తాయన్న భయం తోనే ప్రజల దృష్టిని మళ్లించేందుకు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. ఆర్థిక నేరాల కేసుల్లో జగన్ మళ్లీ జైలుకెళ్లడం ఖాయమని సత్యకుమార్ పేర్కొన్నారు. అదేవిధంగా పీపీపీ విధానం అంటే ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేయడం, అప్పగించడం కాదని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. పీపీపీ పద్ధతి అంటే అర్థం తెలియని వైసీపీ నేతలు ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. దేశంలో 70శాతం మెడికల్ కాలేజీలు పీపీపీ పద్ధతిలోనే ఉన్నాయని వివరించారు. ఇక.. ఇప్పుడు జగన్ వ్యాఖ్యలు.. రాష్ట్ర మంత్రి స్పందనతో ఈ వ్యవహారం రాజకీయంగా కొత్త మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos