తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి, మనుగడ కోసం పోరాడుతున్న విశాఖ ఉక్కు కర్మాగారం (ఆర్ఐఎన్ఎల్) మళ్లీ ప్రగతి పథంలోకి దూసుకెళుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమష్టి కృషితో కేవలం ఏడాది వ్యవధిలోనే ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం అద్భుతంగా మెరుగుపడిందని తెలిపారు. గత ఏడాది సెప్టెంబర్లో కేవలం 25 శాతంగా ఉన్న కెపాసిటీ వినియోగం, ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ఏకంగా 79 శాతానికి చేరుకోవడం ప్లాంట్ పునరుజ్జీవానికి సంకేతంగా నిలుస్తోందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు అమరావతి సచివాలయంలో స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడానికి, దానిని బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో ఉంది. ఏడాది కాలంలో సాధించిన ఈ ప్రగతి ఎంతో సంతోషాన్నిచ్చే విషయమని" అన్నారు. ప్లాంట్ను నష్టాల నుంచి గట్టెక్కించి, లాభాల బాట పట్టించాలంటే యాజమాన్యం, కార్మికులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకుని, ప్లాంట్ పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. ఈ ప్రయత్నాల ఫలితంగా కేంద్రం రూ.11,440 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ఈ నిధులలో మెజారిటీ మొత్తం ఇప్పటికే విడుదల కావడంతో, వాటిని వినియోగించి ప్లాంట్ను తిరిగి గాడిన పెట్టే పనులు వేగవంతమయ్యాయి. కేంద్రం నుంచి అందిన ఆర్థిక చేయూతకు, రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు అందిస్తున్న సహకారం తోడవడంతో ఉత్పత్తిలో గణనీయమైన పురోగతి సాధ్యమైందని అధికారులు సీఎంకు వివరించారు.
ప్లాంట్ పనితీరు, పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు కఠినమైన విధానాన్ని అమలు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ఇకపై ప్రతి మూడు నెలలకు ఒకసారి తాను స్వయంగా స్టీల్ ప్లాంట్పై సమీక్ష నిర్వహిస్తానని తెలిపారు. అదేవిధంగా, ప్రతి నెలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) స్థాయిలో సమీక్ష జరిపి, పురోగతి నివేదికను తనకు అందించాలని స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్తో పాటు ఆర్ఐఎన్ఎల్ సీఎండీ అజిత్ కుమార్ సక్సేనా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos