ఒకప్పుడు టీడీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ ఛీఫ్ గా పనిచేసి ఆ తర్వాత వైసీపీకి, వైఎస్ జగన్ కు టార్గెట్ అయిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తాజాగా రాజకీయ ప్రవేశం చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంత హఠాత్తుగా ఆయన ఈ ప్రకటన ఎందుకు చేయాల్సి వచ్చిందనే దాని వెనుక చాలా కారణాలు ఉన్నప్పటికీ ప్రధానంగా మాత్రం ఓ కారణం కనిపిస్తోంది. ఆ కారణమే ఇప్పుడు ఆయన్ను రాజకీయంవైపు నడిపించిందన్న చర్చ సాగుతోంది. రాష్ట్రంలో గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఇంటెలిజెన్స్ ఛీఫ్ గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావు వైసీపీ ఎమ్మెల్యేల్ని ప్రలోభపెట్టి, బెదిరించి వారిని టీడీపీవైపు ఫిరాయించేలా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో వైసీపీకీ, జగన్ కూ ఆయనపై కోపం అలాగే ఉండిపోయింది. దీంతో టీడీపీ స్దానంలో వైసీపీ ప్రభుత్వం రాగానే ఆయన్ను టార్గెట్ చేసేందుకు పెట్టాల్సిన కేసుల్ని వెతుకుతున్నప్పుడు అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు నిఘా పరికరాలు వాడారన్న కారణంతో ఆయన్ను సస్పెండ్ చేశారు. చివరికి ఏబీ సుప్రీంకోర్టు వరకూ వెళ్లి ఎలాగోలా ఈ వ్యవహారం నుంచి బయటపడ్డారు.
అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆయనకు మంచి పదవి దక్కుతుందని భావించారు. తద్వారా ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించవచ్చని అనుకున్నారు. కానీ చంద్రబాబు ఆయనకు ఆ అవకాశం ఇవ్వలేదు. చివరికి కమ్మ సామాజిక వర్గ సమావేశంలో ఏబీ చేసిన వ్యాఖ్యల తర్వాత ఆయనకు పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇచ్చారు. దీన్ని అవమానంగా భావించిన ఆయన బాధ్యతలు చేపట్టకుండా ఉండిపోయారు. ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. అయితే ఈ మధ్యలో ఏ జరిగిందన్న దానిపైనే ఇప్పుడు చర్చ సాగుతోంది.
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో తమను టార్గెట్ చేసిన తీరుతో టీడీపీ నాయకులు, క్యాడర్ జగన్ పేరు చెప్తేనే మండిపడుతున్నారు. కూటమి సర్కార్ రాగానే ఆయన్ను ఓ రేంజ్ లో టార్గెట్ చేస్తుందని, జైల్లో వేస్తుందని చాలామంది భావించారు. అయితే వీరి అంచనాలు భిన్నంగా కూటమి సర్కార్ జగన్ విషయంలో ఆచిచూచి వ్యవహరిస్తోంది. గతంలో చంద్రబాబును జైలుకు పంపిన జగన్ పరిస్దితి తమకు రాకూడదని భావిస్తోంది. కానీ ఈ లాజిక్ ను వీరంతా అంగీకరించేలా లేరు. దీంతో వీరిని సంతృప్తిపర్చేందుకే ఇప్పుడు ఏబీ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.
చంద్రబాబు సీఎంగా ఉండి చేయలేకపోతున్న పనిని ఏబీవీ ద్వారా చేయిస్తున్నారా అనే ఓ చర్చ సాగుతోంది. మరోవైపు చంద్రబాబు చేయలేని పని చేయడం ద్వారా తన సొంత సామాజిక వర్గాన్ని సంతృప్తి పర్చేందుకు ఏబీనే స్వయంగా రంగంలోకి దిగారన్న మరో ప్రచారం కూడా జరుగుతోంది. అయితే రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఏబీ చెప్పినా ఇప్పట్లో ఆయన స్వయంగా పార్టీ పెట్టే పరిస్ధితి లేదు. అలాగే టీడీపీలో చేరే పరిస్ధితి కూడా లేదు. కాబట్టి టీడీపీ బాటలోనే వెళ్తూ జగన్ ను టార్గెట్ చేయడం ద్వారా సొంత సామాజిక వర్గ నాయకుల్ని వారి నిధులతోనే సంతృప్తి పర్చేందుకు ఏబీ ప్రయత్నిస్తారని తెలుస్తోంది. ఏం జరుగుతుందో మరి చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos