వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను మాజీ మంత్రి అంబటి రాంబాబు కలిశారు. తనపై కేసు నమోదయి జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత ఆయన తాడేపల్లికి వచ్చి జగన్ తో భేటీ అయ్యారు. తనపై నమోదయిన అక్రమ కేసులు, తన ఇంటిపై జరిగిన దాడి విషయాన్ని జగన్ కు వివరించారు. బెయిల్ పై విడుదలయిన అంబటి రాంబాబు జగన్ వద్ద జరిగిన విషయాలను తెలిపారు. అయితే అక్రమ కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చట్టపరంగా ఎదుర్కొందామని అంబటికి జగన్ భరోసా ఇచ్చారు. కొందరు అధికార పార్టీకి పోలీసు అధికారులు వత్తాసు పలుకుతున్నారని, వారిని కూడా వదిలి పెట్టేది లేదని తెలిపారు.
తర్వాత అంబటి రాంబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాను అన్న మాటలకు క్షమాపణలు చెప్పానని, అయినా తాను చంద్రబాబును దూషించలేదని అన్నారు. తాను క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా తన ఇంటిపై దాడి గంటల పాటు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదని అన్నారు. తాను కమ్మ సామాజికవర్గాన్ని పేరు పెట్టి దూషించానని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. తాను అనని మాటలను అన్నట్లు రిమాండ్ రిపోర్టులో సీఐ పేర్కొనడాన్ని అంబటి రాంబాబు తప్పు పట్టారు. తనకు సినిమాను చూపించి మీరు విలన్లయ్యారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కు సవాల్ విసిరారు. అసలు హీరో ఎవరో ఆలోచించుకోవాలన్నారు. అన్నింటికీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని అంబటి రాంబాబు చెప్పారు.
కాగా కులాల మధ్య చిచ్చు పెట్టే వ్యక్తిని తాను కాదని నిరూపించుకోవడానికి అంబటి తన వ్యక్తిగత విషయాలను ప్రస్తావించారు. తన కుటుంబంలోని ఎనిమిది మంది సభ్యులలో ఇద్దరు అల్లుళ్లు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారేనని ఆయన వెల్లడించారు. నా అల్లుళ్లు ఇద్దరు అదే సామాజిక వర్గం వారైనప్పుడు, నేను ఆ కులాన్ని ఎలా దూషిస్తానని అమాయకత్వం నటించారు. కానీ అంబటి రాంబాబును కాపు నేతగా వైసీపీ రుద్దేసిందన్న సంగతి ఆయనకు ఇంకా తెలిసి వచ్చినట్లుగా లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos