ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక గిరిజనులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 100 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఉద్యోగాల్లో స్థానిక గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించేందుకు ఉమ్మడి ఏపీలో 2000 ఏడాదిలో జీ.వో నెంబర్ 3 తెచ్చామని గుర్తు చేశారు. న్యాయ సమీక్షలో రద్దయిన జీవో నెంబర్ 3 పునరుద్దరణ కోసం అధికారులతో సమీక్ష చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, మార్గదర్శకాలు పాటిస్తూనే... 2020లో రద్దయిన జీ.వో నెంబర్ 3 పునరుద్దరణకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలని అధికారులను సిఎం చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. ఈ రివ్యూలో గిరిజన సంక్షేమశాఖ, న్యాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ‘‘1986లో వచ్చిన జీవో ప్రకారం ఏజెన్సీలో స్థానిక గిరిజనులకు టీచర్ పోస్టుల్లో 100 శాతం రిజర్వేషన్లు కల్పించాం. దీనిపై న్యాయపరమైన చిక్కులు రావడంతో మళ్లీ పెరిగిన మహిళా రిజర్వేషన్ల శాతాన్ని పరిగణనలోకి తీసుకుని 2000లో జీవో ఎంఎస్ నంబర్ 3 తెచ్చాం. తద్వారా సుమారు 4,626 టీచర్ ఉద్యోగాలు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు దక్కాయి. అయితే జీవో నెంబర్ 3 పై 2002లో కొందరు కోర్టును ఆశ్రయించగా... వివిధ స్థాయిల్లో విచారణ అనంతరం 2020లో ఈ ఉత్తర్వులను సుప్రీంకోర్టు రద్దు చేసింది. గత వైసీపీ ప్రభుత్వం దీనిపై రివ్యూ పిటిషన్ వేయడంలో తీవ్ర నిర్లక్ష్యం పాటించడంతో సుప్రీం కోర్టు దాన్ని కొట్టేసింది. ఈ కారణంగా గిరిజనులు జీవో నెంబర్ 3 ద్వారా లభించే లబ్దిని కోల్పోయారని సీఎం అన్నారు.
జీవో నెంబర్ 3 పునరుద్దణ లేదా అదేవిధంగా న్యాయం చేయడానికి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ హామీ మేరకు జీ.వో నెంబర్ 3 రద్దు అనంతర పరిణామాలపై అధికారులతో సీఎం చంద్రబాబు చర్చించారు. గిరిజన ప్రాంతాల్లో జీవో 3 ద్వారా గతంలో గిరిజనులకు కలిగిన లబ్దిని పునరుద్దరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరిపారు. ఏజెన్సీలో ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానిక గిరిజనులకు 100 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి అవకాశాల గురించి, చట్టపరంగా ఉన్న వివిధ అవకాశాలు, అడ్డంకుల గురించి చర్చించారు. గిరిజనుల, గిరిజన సంఘాల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. తిరిగి ఈ ఉత్తర్వుల ద్వారా లభించే లబ్దిని గిరిజనులకు తిరిగి అందించడానికి చర్యలకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా న్యాయ పరమైన అంశాలు, సుప్రీంకోర్టు తీర్పు, గిరిజన హక్కుల పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనం చేయాలని సీఎం అన్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos