ప్రజలకు మెరుగైన సేవలందించడానికి డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాలు (డీడీవో) ఉపయోగపడతాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. చిత్తూరులో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని పవన్ కల్యాణ్ ప్రారంభించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 77 డీడీవో కార్యాలయాలను చిత్తూరు నుంచి పవన్ వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిలో భాగంగా 77 డీడీవో కార్యాలయాలు ప్రారంభించామని తెలిపారు. 77 డీడీవో ఆఫీసులు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.
పవన్ కళ్యాణ్ చిత్తూరు లో కూటమి నేతలతో సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వానికి ఇంత బలం ఉండి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా నిష్ప్రయోజనమే అని పేర్కొన్నారు. ఎటువంటి పైరవీలకు తావు లేకుండా అర్హతే ఆధారంగా ఉద్యోగులకు పదోన్నతులు కల్పించామన్నారు. కూటమి ప్రభుత్వం వ్యవస్థల ప్రక్షాళనపై ఇంత బలంగా ముందుకు వెళ్తుందంటే మీ అందరూ ప్రభుత్వానికి అండగా నిలబడడంతోనే ఇదంతా సాధ్యమైందని చెప్పారు. కూటమిలో ఉన్న మూడు పార్టీల నాయకులకు విభిన్న భావజాలాలు ఉన్నా... మనందరం రాష్ట్రం బాగుండాలి- అరాచకాలు ఉండకూడదనే సదుద్దేశంతో ఒక గొడుగు కిందకు వచ్చి కూటమిగా ఏర్పడ్డామని చెప్పారు. మనలో మనకు చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్స్, మనస్పర్థలు ఉండటం సహజమని పేర్కొన్నారు. ఒకచోట కూర్చొని మాట్లాడుకుంటే అన్ని సమస్యలు తీరతాయని చెప్పుకొచ్చారు. ఆ రోజు చిన్నగా మొదలుపెట్టిన కూటమి ఈ రోజు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి ఎంతో బలమైన శక్తిగా మారిందన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేయడానికి ఐటీ వింగ్ ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే గ్రామీణాభివృద్ధి శాఖ పని అన్నారు.
చిత్తూరు జిల్లా పర్యటన ముగించుకుని రేణిగుంట విమానాశ్రయానికి వెళ్తున్న పవన్ కల్యాణ్ తిరుపతి శివారు దామినేడు వద్ద రైతులను కలిశారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ రూపొందించిన ప్లకార్డులను చేతబట్టి వర్షంలో తడుస్తూ రైతులు జాతీయ రహదారి పై ఎదురు చూశారు. కర్షకుల వద్ద పవన్ తన కాన్వాయ్ని ఆపి వారితో మాట్లాడారు. పవన్ వద్దకు వచ్చిన రైతులు తాము ఎదుర్కొంటున్న భూసమస్యను ఆయనకు వివరించగా.. జిల్లా కలెక్టర్ తో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos