తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపరంగా సంస్కరణల దిశగా అడుగులు వేయబోతోంది. త్వరలో పార్టీ పొలిట్ బ్యూరోను పూర్తి స్థాయిలో సంస్కరించే అవకాశం కనిపిస్తోంది. పార్టీలో పొలిట్ బ్యూరో అత్యున్నత నిర్ణాయక కమిటీ. ఇందులో 22 మంది సభ్యులు ఉంటారు. పార్టీ పరంగా ఏ నిర్ణయం తీసుకోవాలన్న పొలిట్ బ్యూరోలో చర్చించిన తరువాతే ఓ అభిప్రాయానికి వస్తారు. 22 మంది పొలిట్ బ్యూరో సభ్యుల్లో ఎక్కువ మంది చంద్రబాబు సహచరులు. దాదాపు 80 శాతం మంది 70 ఏళ్లు పైబడిన వారు. వచ్చే ఎన్నికల నాటికి వీరు రిటైరయ్యే అవకాశం ఉన్నందున వీరి స్థానంలో ఇప్పుడే కొత్తవారిని పొలిట్ బ్యూరోలోకి తీసుకోవాలని పార్టీ నిర్ణయించింది. పాత తరానికి విశ్రాంతినిచ్చి యువతను తీసుకోవాలని చంద్రబాబు,లోకేష్ ఓ నిర్ణయానికి వచ్చారని సమాచారం.
భవిష్యత్తు రాజకీయాల దృష్ట్యా దూకుడుగా ఉండే వారికి అవకాశం కల్పించాలని అనుకుంటున్నారు. పార్టీ బాధ్యతలను యువనేత లోకేశ్కు పూర్తి స్థాయిలో అప్పజెప్పాలనే డిమాండ్ ఎక్కువగా వినిపిస్తోంది. అందుకే ప్రభుత్వంలో లోకేశ్ ప్రాధాన్యం పెంచాలని, ఆయనకు ఉప ముఖ్యమంత్రి హెూదా ఇవ్వాలని కూడా కార్యకర్తలు కోరుతున్నారు. ఇదే సమయంలో పార్టీలో తన జట్టుకు కీలక బాధ్యతలు అప్పగించేలా లోకేశ్ ప్లాన్ రెడీ. చేసుకున్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం పొలిట్ బ్యూరోలో ఉన్న వారిలో శ్రీనివాసులురెడ్డి, గుమ్మడి సంధ్యారాణి, కొల్లు రవీంద్ర వంటి కొంతమందిని మాత్రమే కొనసాగించే అవకాశం ఉంది. రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, చింతకాయల విజయ్, పరిటాల శ్రీరామ్, టీజీ భరత్, విశాఖ ఎంపీ భరత్, యనమల దివ్య, మంత్రి సవిత, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వంటివారి పేర్లను పరిశీలిస్తున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, అమలాపురం ఎంపీ మాధుర్ సహా మరో ఇద్దరు మహిళా నేతల పేర్లు కూడా విన్పిస్తున్నాయి. మెల్లగా పార్టీపై పట్టు పెంచుకోవాలని లోకేష్ అనుకుంటున్నారు. పొలిట్ బ్యూరో మొత్తాన్ని కొత్తవారితో నింపడం ద్వారా లోకేశ్కు పార్టీపై పట్టు పెంచే ప్రయత్నం జరుగుతోందనే వాదన విన్పిస్తోంది. పార్టీపరంగా లోకేశ్కు పూర్తి బాధ్యతలు అప్పగించి ఆ తరువాత డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే ఆలోచన చేయవచ్చని తెలుస్తోంది. సో.. టీడీపీ పొలిట్ బ్యూరోలో త్వరలో కొత్త ఫేస్ లను చూడొచ్చని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos