ప్రయాణికుల సేవల్లో డిజిటల్ టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగిస్తున్న ఏపీఎస్ఆర్టీసీకి జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. 'గవర్నెన్స్ నౌ - 6వ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సమ్మిట్' అవార్డును ఏపీఎస్ఆర్టీసీ దక్కించుకోవడం రాష్ట్రానికి గర్వకారణమని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారులు, సిబ్బంది అంకితభావంతో ప్రయాణికులకు సేవలు అందిస్తున్న తీరు అభినందనీయమని ఆయన ప్రశంసించారు.
ప్రయాణికులకు అవసరమైన సమాచారం ముందుగానే అందేలా చర్యలు తీసుకోవడం వల్ల సేవల నాణ్యతలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని మంత్రి తెలిపారు. ప్రజాసేవలో డిజిటల్ సాంకేతికతను విజయవంతంగా అమలు చేసిన ఆర్టీసీ కృషికి జాతీయ వేదికపై గుర్తింపు రావడం ఆనందకరమన్నారు. ముఖ్యంగా ప్రధాన బస్టాండ్లలో అమలు చేస్తున్న ఆటోమేటిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ (AAS) ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా మారిందని పేర్కొన్నారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డు సాధనలో కీలక పాత్ర పోషించిన ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావును మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ఆర్టీసీ ముందడుగు వేస్తోందని చెప్పారు. రాబోయే రోజుల్లో మరింత ఆధునికమైన, ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలను అందించడమే లక్ష్యంగా ఆర్టీసీ పనిచేస్తోందన్నారు.
2025 సంవత్సరానికి గాను ఈ అవార్డుకు ఏపీఎస్ఆర్టీసీని ఎంపిక చేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రధాన బస్ స్టేషన్లలో ఆటోమేటిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ను విజయవంతంగా అమలు చేయడం ద్వారా ప్రయాణికులకు స్పష్టమైన సమాచారం అందిస్తున్నందుకు ఈ గౌరవం దక్కింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు అవార్డును స్వీకరించారు. డిజిటల్ మార్పులతో ప్రభుత్వ సేవలను మరింత ప్రజల దగ్గరకు తీసుకెళ్లడంలో ఏపీఎస్ఆర్టీసీ ఆదర్శంగా నిలుస్తోందన్న అభిప్రాయం ఈ అవార్డుతో మరింత బలపడింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos