2024 ఎన్నికల ముందు వ్యూహం, శపథం అనే సినిమాలు తీసి వైసీపీ ఓటమిలో కీలక పాత్ర పోషించిన రామ్ గోపాల్ వర్మకు ఆ సినిమాల పేరుతో కొట్టేసిన ప్రజాధనం తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. రూ. కోటి పదిహనేను లక్షల రూపాయలను.. పన్నెండు శాతం వడ్డీతో పదిహేను రోజుల్లో చెల్లించాలని తాజాగా ఏపీ ప్రభుత్వం ఆర్జీవీకి నోటీసులు జారీ చేసింది. ఈ డబ్బులు వ్యూహం సినిమా ఫైబర్ నెట్లో ప్రసారానికి ఇచ్చి వ్యూస్ ప్రకారం తీసుకున్న డబ్బులు. ఎవరైనా ఒక్కరు సినిమా చూస్తే రూ. 100 ఇవ్వాలని ఒప్పందం చేసుకుంటే మొత్తంగా 1863 మంది మాత్రమే చూశారు. ఆయితే ఆయనకు రూ.కోటి పదిహేను లక్షలు చెల్లించేశారు.
అసలు ఆ సినిమాకు నిర్మాత ఆర్జీవీ కాదు. దర్శకత్వం చేసినందుకు ఆయన ఆ రైట్స్ తీసుకుని ఫైబర్ నెట్ కు ఇచ్చారేమో తెలియదు కానీ.. డబ్బులు మాత్రం ఆయన ఖాతాకే వెళ్లాయి. అసలు ఆ డబ్బులు ఇచ్చింది సోషల్ మీడియా లో బూతులు తిట్టినందుకని చాలా మందికి డౌట్. ఆ కేసులు కూడా పడ్డాయి. వారం రోజుల పాటు ఎవరికీ కనిపించకుండా పోయి కోర్టుకెళ్లి అరెస్టు చేయకుండా ఆదేశాలు తెచ్చుకున్నారు. ఇప్పుడు కొట్టేసిన డబ్బుల విషయంలో నోటీసులు వచ్చాయి.
ఈ విషయంలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, అప్పటి ఫైబర్ నెట్ ఎండీ మద్దిరాల మధుసూదన్ రెడ్డి, ఉయ్యూరు గుణ శంశాక్ రెడ్డి, RGV AARVI గ్రూప్ భాగస్వామి గొట్టిముక్కల రవిశంకర్ వర్మ, RGV AARVI గ్రూప్ ఎండీ రామ్ గోపాల్ వర్మతో పాటుగా ఆర్జీవీ ఆర్వీ గ్రూప్నకు లీగల్ నోటీసులు పంపించారు. నిబంధనలకు విరుద్ధంగా అనుచితంగా లబ్ధి పొందినందున 15 రోజుల లోపు వడ్డీతో సహా మొత్తం కట్టాలని లీగల్ నోటీసుల్లో స్పష్టం చేశారు. ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి ఆదేశాల మేరకు ఫైబర్ నెట్ ఈ లీగల్ నోటీసులు పంపింది.
మరోవైపు ఈ విషయమై ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఛైర్మన్ జీవీ రెడ్డి ఇటీవల విలేకరుల సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఏపీ ఫైబర్నెట్ ద్వారా వ్యూహం సినిమా చూసినందుకు ఒక్కో వ్యూకు రూ.11 వేలు చెల్లించారన్న జీవీ రెడ్డి.. మొత్తం రూ.2.10 కోట్లు ఫైబర్నెట్ బ్యాంకు అకౌంట్ నుంచి ఆర్వీజీ ఆర్వీ సంస్థ బ్యాంకు ఖాతాలోకి వెళ్లాయని ఆరోపించారు. ఏపీ ఫైబర్నెట్ ఛానల్లో వ్యూహం సినిమాను కేవలం 1,863 మంది మాత్రమే చూశారని.. ఒప్పందం ప్రకారం ఒక్కో వ్యూకు రూ.100ల చొప్పున చెల్లించాల్సి ఉందన్నారు. కానీ ఏకంగా 11 వేల చొప్పున చెల్లించినట్లు తెలిపారు. ఆర్జీవీ ఆర్వీ సంస్థకు రూ.2 లక్షలు రావాల్సి ఉంటే.. రూ.2 కోట్లకుపైగా చెల్లించారని ఆరోపించారు. ఏపీ ఫైబర్ నెట్లో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరుపుతామని అప్పట్లోనే స్పష్టం చేశారు. ఈ క్రమంలో తాజాగా వ్యూహం సినిమాకు ఏపీ ఫైబర్ నెట్ నుంచి లీగల్ నోటీసులు పంపించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos