ఎమ్మెల్సీ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి . ఉమ్మడి కృష్ణా- గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో పోటీలో ఉన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో పోటీలో ఉన్న పేరాబత్తుల రాజశేఖర్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇంకా చెప్పాలంటే... ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం విషయంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చాలా ముందంజలో ఉన్నారు. ఆయనకు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు పూర్తిగా సహకరిస్తూ వారు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక రాజకీయ నేపథ్య విషయానికొస్తే ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఏపీ రాజకీయాల్లో సీనియర్ రాజకీయ నాయకుడు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితులు. అలాగే చంద్రబాబుతో కలిసి రాజకీయ ప్రయాణం కొనసాగించారు. ఆయన తన రాజకీయ జీవితంలో తెనాలి, వేమూరు నియోజకవర్గాల నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా పనిచేశారు.
ఆలపాటి రాజేంద్రప్రసాద్.. 1960 ఫిబ్రవరి 4వ తేదీన గుంటూరు జిల్లాలో ఆలపాటి శివరామకృష్ణ దంపతులకు జన్మించారు. ఆయన ప్రాథమిక, ఉన్నత విద్య గుంటూరు జిల్లాలోనే కొనసాగింది. ఆయన తండ్రి శివరామకృష్ణ ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు. స్టూడెంట్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సెక్రటరీగా పని చేశారు. ప్రముఖ లీడర్ గా ఆయన రాజకీయాల్లో కొనసాగారు. ఇలా తండ్రిని చూస్తూ రాజేంద్రప్రసాద్ కూడా రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారు. అలా చదువుకునే రోజుల్లో స్టూడెంట్ ఫెడరేషన్ లో యాక్టివ్ గా పని చేసేవారు.
ఆలపాటి రాజేంద్రప్రసాద్ సమాజసేవతోపాటు చదువులో కూడా ముందుండేవారు. ఆయన ఎల్ఎల్ బీ పూర్తి చేసిన తరువాత 1985లో హైదరాబాద్ వచ్చారు. ప్రముఖ సీనియర్ లాయర్ మువ్వా చంద్రశేఖర్ గారి దగ్గర జూనియర్ గా చేరారు. చంద్రశేఖర్ ఆనాటి సీఎం ఎన్టీఆర్, టీడీపీకి సంబంధించిన కేసులను వాదించేవారు. ఈ సమయంలో ఆ కేసులన్నీ వాదించే టీంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా లాయర్ గా చేరారు. ఈ సమయంలోనే సీనియర్ ఎన్టీఆర్ గారితో పరిచయం ఏర్పడింది. ఇక ఆలపాటి రాజేంద్రప్రసాద్ వ్యక్తిగత జీవితానికి వస్తే.. ఆయన భార్య పేరు మాధవి. వీరికి ఇద్దరు సంతానం
ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తండ్రి శివరామకృష్ణకు ఎన్టీఆర్ అంటే పిచ్చి అభిమానం. ఆయన తన సొంత ఇంటిని, అలాగే ఆయనకు వచ్చే పింఛన్లు కూడా పార్టీకి విరాళంగా ఇచ్చారు. ఈ విషయంలో ఆలపాటి కూడా తన తండ్రి బాటలో నడిచారు. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన పార్టీలో వివిధ హోదాల్లో పని చేశారు. 1994లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వేమూరు నియోజకవర్గం నుండి తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
ఇక 1999లో రెండోసారి కూడా అదే నియోజకవర్గంలో వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆ సమయంలో అంటే... 22 అక్టోబర్ 1999 నుండి 26 నవంబర్ 2001 వరకు చంద్రబాబు మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా పని చేశారు. ఈ సమయంలోనే రాష్ట్రంలో ఎన్నో పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలు స్థాపించారు.కానీ, ఆ తరువాత 2004లో జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు.
దీంతో ఆయన తన రాజకీయ ప్రయాణాన్ని తెనాలి నియోజకవర్గ నుంచి సాగించారు. నిత్యం నియోజకవర్గ ప్రజలకు దగ్గరగా ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసేవారు. కానీ, 2009 ఎన్నికల్లో పోటీ చేసినా గెలుపొందలేదు. ఆ తరువాత 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఆలపాటి నిలబడగా ..వైసీపీ తరఫున అన్నాబత్తిని శివకుమార్ నిలబడ్డారు. ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్రప్రసాద్ గెలుపొందారు. ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఆలపాటి పోటీలో నిలవగా వైసీపీ తరఫున అన్నాబత్తిని శివకుమార్ నిలిచారు. ఎన్నికల్లో వైసీపీ గెలిచి శివకుమార్ ఎమ్మెల్యే అయ్యారు.
ఇక 2024 ఎన్నికల్లో తెనాలి నుంచి టిడిపి తరఫున ఆలపాటి రాజా పోటీ చేయాలని భావించారు. కానీ , ఏపీలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయిన క్రమంలో టీడీపీకి చెందిన రాజేంద్ర ప్రసాద్ కాకుండా జనసేనలో కీలక నాయకుడు నాదెండ్ల మనోహర్ కి టిక్కెట్ కేటాయించగా ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థిగానూ ప్రచారంలో ఓటర్లను ఆకట్టుకుంటూ ఎన్నికల్లో విజయతీరాలు చేరుకునే దిశగా తీవ్రంగా కృషి చేస్తున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ మార్గదర్శకత్వంలో, ఎమ్మెల్యేలు మంత్రుల సహకారంతో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇక ఎన్నికల జరగడమే తరువాయి ఆయన విజయం తథ్యమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos