అహ్మదాబాద్ విమాన ప్రమాదంతో ఎయిర్ ఇండియా అలర్ట్ అయింది. విమానాల నిర్వహణ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. అందులో భాగంగా పలు సమస్యలను గుర్తించింది. విమానాలను సాంకేతిక, నిర్వహణ సమస్యలు వెంటాడటం పైన ఆందోళన కనిపిస్తోంది. ఇప్పుడు ఎయిర్ ఇండియా నిర్వహణ సమస్యల కారణంగా ఏకంగా ఎనిమిది విమాన సర్వీసులను రద్దు చేసింది. అందులో నాలుగు అంతర్జాతీయ.. నాలుగు దేశీయ విమానాలు ఉన్నాయి. ఎయిర్ ఇండియా తమ సంస్థకు చెందిన విమానాల నిర్వహణ పైన ప్రత్యేకంగా కసరత్తు చేస్తోంది. ప్రతీ సర్వీసును పూర్తిగా ప్రతీ విభాగంలో క్షుణ్నంగా పరిశీలన నిర్వహిస్తోంది. అందులో భాగంగా నిర్వహణ సమస్యలు గుర్తించిన ఎనిమిది విమాన సర్వీసులను ఎయిర్ ఇండియా రద్దు చేసింది. ఇంటర్నేషనల్ సర్వీసుల్లో దుబాయ్ - చెన్నై, దిల్లీ - మెల్బోర్న్, మెల్బోర్న్ - దిల్లీ, దుబాయ్ - హైదరాబాద్ మధ్య ప్రయాణించాల్సిన విమానాలు ఉన్నాయి. ఇక డొమెస్టిక్ సర్వీసుల్లో పుణె - దిల్లీ, అహ్మదాబాద్ - దిల్లీ, హైదరాబాద్ - ముంబయి, చెన్నై - ముంబయి విమానాలు ఉన్నాయి.
నిర్వహణ సమస్యల కారణంగా జులై రెండో వారం వరకు తమ అంతర్జాతీయ విమాన సర్వీసులను 15 శాతం తగ్గిస్తామని ఎయిరిండియా ప్రకటించింది. ఈ క్రమంలోనే 16 అంతర్జాతీయ మార్గాల్లో విమాన సర్వీసులను తగ్గించినట్లు తెలిపింది. జూన్ 21 నుంచి జులై 15 వరకు ఈ సర్వీసుల తగ్గింపు కొనసాగుతుందని ఎయిర్ ఇండియా వెల్లడించింది. సర్వీసుల రద్దు కారణంగా ఇప్పటికే రిజర్వ్ చేసుకున్న ప్రయాణీకుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సర్వీసుల కోసం రిజర్వ్ చేసుకున్న ప్రయాణికులకు పూర్తి రీఫండ్ , ఉచిత రీషెడ్యూలింగ్ అవకాశం కల్పిస్తున్నట్లు ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది. ఇతర సర్వీసుల నిర్వహణ పైన ఫోకస్ చేసిన ఎయిర్ ఇండియా.. భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టినట్లు స్పష్టం అవుతోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos