ఉమ్మడి కృష్ణా - గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీల తరఫున పోటీలో ఉన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ .. తన విజయంపై ధీమాగా ఉన్నారు. ఇప్పటికే కూటమి పార్టీలు చైతన్యం కలిగించడంతో ఎంతోమంది పట్టభద్రులు ఓటర్లుగా పేర్లు నమోదు చేయించుకున్నారు. కొత్తగా నమోదైన ఓటర్లే కాకుండా పాత ఓటర్లు కూడా ఆలపాటికి భారీగా మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఆయన విజయవకాశాలపై భారీ ఆశలు నెలకొన్నాయి. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, ఇంకా పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు ఆయన తరపున పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఏపీ రాజకీయాల్లో సీనియర్ రాజకీయ నాయకుడు అయిన ఆలపాటి రాజేంద్రప్రసాద్ తెనాలి, వేమూరు నియోజకవర్గాల నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా పనిచేశారు. ఆయన 1960 ఫిబ్రవరి 4వ తేదీన గుంటూరు జిల్లాలో ఆలపాటి శివరామకృష్ణ దంపతులకు జన్మించారు. ఆయన ప్రాథమిక, ఉన్నత విద్య గుంటూరు జిల్లాలోనే కొనసాగింది. చదువుకునే రోజుల్లో స్టూడెంట్ ఫెడరేషన్ లో యాక్టివ్ గా పని చేసేవారు. ఎల్ఎల్ బీ పూర్తి చేసిన తరువాత 1985లో హైదరాబాద్ వెళ్లి... సీనియర్ లాయర్ దగ్గర జూనియర్ గా చేరారు. ఈ క్రమంలో ఆలపాటి రాజేంద్రప్రసాద్ తన తండ్రి శివరామకృష్ణ బాటలో నడిచి .. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. పార్టీలో వివిధ హోదాల్లో పని చేసిన ఆలపాటి రాజేంద్రప్రసాద్... 1994లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వేమూరు నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. 1999లో రెండోసారి కూడా అదే నియోజకవర్గంలో వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ సమయంలో అంటే.. 22 అక్టోబర్ 1999 నుండి 26 నవంబర్ 2001 వరకు చంద్రబాబు మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా పని చేశారు.
ఆ తరువాత 2004లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. దీంతో ఆయన తన రాజకీయ ప్రయాణాన్ని తెనాలి నియోజకవర్గ నుంచి సాగించారు. కానీ, 2009 ఎన్నికల్లో పోటీ చేసినా గెలుపొందలేదు. ఆ తరువాత 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఆలపాటి నిలబడగా వైసీపీ తరఫున అన్నాబత్తిని శివకుమార్ నిలబడ్డారు. ఆ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్రప్రసాద్ గెలుపొందారు. ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఆలపాటి పోటీలో నిలవగా వైసీపీ తరఫున అన్నాబత్తిని శివకుమార్ నిలిచారు. ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. శివకుమార్ ఎమ్మెల్యేగా నిలిచారు. ఇక 2024 ఎన్నికల్లో తెనాలి నుంచి టీడీపీ తరఫున ఆలపాటి రాజా పోటీ చేయాలని భావించారు. కానీ , ఏపీలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి కూటమి పార్టీల తరఫున జనసేన అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ పోటీ చేసి గెలిచారు.
ఈ క్రమంలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు ఉమ్మడి కృష్ణా - గుంటూరు జిల్లాల పట్టభద్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను కూటమి పార్టీల తరఫున పోటీలో నిలిపారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఆలపాటి హోరాహోరీగా పోరాడుతున్నారు. ప్రచారంలో భాగంగా పట్టణ ప్రాంతాల్లో ఉండే పట్టభద్రులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. జగన్ రెడ్డి పాలనలో అప్పుల ఊబిగా మారిన రాష్ట్రాన్ని కేవలం 7 నెలల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ విధంగా అభివృద్ధి బాట పట్టిస్తున్నారో ఓటర్లకు వివరిస్తున్నారు. ఏడు నెలల్లోనే రూ.6,33,568 కోట్లు పెట్టుబడులు తీసుకురావడం తద్వారా 4,10,125 మంది యువతకు రానున్న ఉద్యోగ అవకాశాల గురించి విపులంగా చెబుతున్నారు.
ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన తరువాత జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పట్టభద్రులకు విపులంగా చెబుతున్నారు. ప్రజాప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీ, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, విద్యా వ్యవస్థలో తీసుకొస్తున్న మార్పులు, ఉన్నత విద్యను గాడిన పెట్టేందుకు వీసీల నియామకం తదితర అంశాల గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి ఆలపాటి.. టీడీపీ నేతలతో కలిసి చేస్తున్న ప్రభావవంత ప్రచారం ఆయన గెలుపునకు బాటలు వేస్తుందని విద్యావేత్తలు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos