మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రానే వచ్చేసింది. దీంతోపాటు ఎన్నికల ‘కోడ్’ కూడా వచ్చేసింది. 2019లో జరిగిన పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థుల గడువు ముగియనుండడంతో తిరిగి ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో నువ్వానేనా అనేటట్టుగా అభ్యర్థులు ఢీకొనబోతున్నారు. రాష్ట్రంలోని రెండు పట్టభద్రులు, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఏపీలోని రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. కృష్ణా - గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్లను టీడీపీ ప్రకటించింది.
ప్రస్తుతం ఆ స్థానాల నుంచి ఎమ్మెల్సీలుగా ఉన్న కె.ఎస్ లక్ష్మణరావు, పాకలపాటి రఘువర్మ పదవీకాలం ఈ ఏడాది మార్చి 29తో ముగుస్తుంది. దీంతో ఆలోపే ఈ రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా శ్రీకాకుళం - విజయనగరం - విశాఖపట్నం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి కూడా ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు కృష్ణా-గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ రెండు స్థానాల్లోని ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించింది.
రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగా లేవని... ఈ ఎన్నికలు ధర్మబద్ధంగా జరిగే అవకాశాలు కనపడటం లేదని ఆరోపిస్తూ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు ఓటర్లు ప్రశాంతంగా ఓటు వేసే పరిస్థితి కూడా లేదని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. పాకిస్థాన్ తీవ్రవాదుల్ని అరెస్టు చేసినట్లు మన కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారని ... ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలను బాయ్కాట్ చేయాలని నిర్ణయించుకున్నామని మాజీమంత్రి, వైసీపీ నేత పేర్ని నాని ప్రకటించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos