కూటమిలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. విశాఖ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా సొంత పార్టీ నేత పైనే కూటమి నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. విశాఖలో విమానాల రద్దు వ్యవహారం రాజకీయ రచ్చగా మారుతోంది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విమానయాన శాఖ పర్యవేక్షిస్తున్నారు. విశాఖ నుంచి వరుసగా విమానాల రద్దు పైన వ్యతిరేకత కనిపిస్తోంది. అయితే, ఈ విమానాల వ్యవహారం పైన రామ్మోహన్ నాయుడు అధికారికంగా స్పందించలేదు.
తాజాగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తాను విశాఖ నుంచి అమరావతికి రావాలంటే హైదరాబాద్ మీదుగా రెండు విమానాలు మారి రావాల్సి వచ్చిందని టికెట్లతో సహా ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ వైరల్ కావటంతో పార్టీ నాయకత్వం స్పందించింది. గంటా శ్రీనివాసరావు పైన టీడీపీ నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఈ వ్యవహారం కూటమిలో సంచలనంగా మారుతోంది. పార్టీలో సీనియర్ నేతగా ఉంటూ సమస్యపైన స్పందించే తీరు సరికాదని మందలించింది.
ఏదైనా ఉంటే ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని.. ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఏంటని నిలదీసినట్లు సమాచారం. దీనికి కొనసాగింపుగా బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణు కుమార్ రాజు కీలక వ్యాఖ్యలు చేసారు. విశాఖ లో విమానాల రద్దు వ్యవహారం పైన స్పందించారు. కూటమి నుంచి కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు విమానయాన శాఖ మంత్రిగా ఉండగా.. విశాఖ పైన ఏంటీ నిర్ణయాలు అని ప్రశ్నించారు. ఇక, ఇప్పటికే టీడీపీ నాయకత్వం స్పందించింది. సమస్య ఉంటే నేరుగా రామ్మోహన్ నాయుడుకు ఫోన్ చేసి వివరించాల్సిందని పేర్కొంది. భవిష్యత్ లో ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోవాలని గంటా ట్వీట్ పైన హెచ్చరించింది.
విశాఖ నుంచి విమాన సర్వీసులు ఒక్కొక్కటిగా రద్దయిపోతుండటంతో రాష్ట్ర ఆర్థిక రాజధాని నుంచి వెళ్లే ప్రయాణీకులకు ఇబ్బంది ఏర్పడుతుందని, విశాఖపట్నం నుంచి అమరావతికి విమానంలో వెళ్లాలంటే... హైదరాబాద్ మీదుగా ప్రయాణించాల్సి వస్తోందంటూ మరి కొందరు ముఖ్యులు చెబుతున్నారు. విశాఖలో విమాన ప్రయాణికులకు ఎందుకు ఈ దుస్థితి వచ్చిందో ఆలోచన చేసి, తగిన చర్యలు చేపట్టాల్సి ఉందని కోరుతున్నారు. గంటా తన ట్వీట్ను సీఎం చంద్రబాబు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు, మంత్రి లోకేశ్కు ట్యాగ్ చేశారు. అయితే, విమానాల సమస్య పైన కూటమి నేతలు ఓపెన్ గా చేస్తున్న వ్యాఖ్యలు రామ్మోహన్ నాయుడుకు ఇరకాటంగా మారుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos