ఏపీ రాజధాని అమరావతిలో ఆర్-1జోన్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. మౌలిక వసతుల అభివృద్ధి పనుల్లో భాగంగా ఆర్-1 జోన్‌లో భవనాలు, స్థలాలు కోల్పోతున్న వారికి సీఆర్డీఏ తీపికబురు చెప్పింది. వీరందరి కోసం నెగోషియేటెడ్‌ సెటిల్‌మెంట్‌ పాలసీలో భాగంగా ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించేందుకు, పరిహారం చెల్లిస్తారు. అయితే ఈ పాలసీలో ప్రభుత్వం కొన్ని అవసరమైన సవరణలు చేసింది. గతంలో ఆర్-1జోన్‌లో ఇళ్లు/భవనాలతో సహా స్థలాలు కోల్పోయిన వారికి.. ఆయా కట్టడాల విలువకు రెట్టింపు పరిహారం ఇచ్చేవారు. అలాగే సీఆర్‌డీఏ స్థలానికి బదులు దాని విస్తీర్ణానికి దగ్గరగా ఉన్న (నియరెస్ట్‌ స్టాండర్డ్‌ ప్లాట్‌) స్థలాన్ని ఎల్‌పీఎస్‌ లేఔట్‌లో ఇచ్చేది. అయితే దీనివల్ల వారందరికి నష్టం జరుగుతోంది.

తాజాగా సీఆర్డీఏ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆర్-1జోన్‌లో ఇళ్లు/ భవనాలు కోల్పోతున్న వారికి.. స్థలానికి సమానంగా విస్తీర్ణంలో స్థలం (ల్యాండ్‌ టు ల్యాండ్‌) కేటాయించేలా నిబంధనలు సవరించి ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్-1జోన్‌లో కోల్పోయిన స్థలం చిన్నది అయితే.. ఒకవేళ ఎల్‌పీఎస్‌ లేఔట్లలో అంత చిన్న స్థలాలు ఇవ్వలేకపోతే మరో నిర్ణయం తీసుకున్నారు. అక్కడ ఇద్దరు ముగ్గురికి కలిపి ఒక స్థలాన్ని కేటాయించేలా వెసులుబాటు కల్పించారు. ల్యాండ్‌ టు ల్యాండ్‌ (స్థలానికి సమానమైన స్థలం) విధానంలో వీరికి గరిష్ఠంగా 3 ప్లాట్ల వరకు పొందే ఛాన్స్ ఉందంటున్నారు. ఒకవేళ వారు స్థలం వద్దని భావిస్తే టీడీఆర్‌ బాండ్‌లూ కూడా తీసుకోవచ్చు. ఆర్-1 జోన్‌లో కమర్షియల్, ఇండస్ట్రియల్ భవనాలు కోల్పోతున్న వారి కోసం మరో నిర్ణయం తీసుకున్నారు. ఆయా కట్టడాల విలువకు రెట్టింపు చెల్లిస్తారు. అంతేకాదు రిహాబిలిటేషన్‌ సెంటర్‌లో స్థలానికి సమానమైన స్థలాన్ని కూడా ఇస్తారు.

అమరావతిలో హైకోర్టు, అసెంబ్లీ భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. అయితే వీటిలో చేపట్టనున్న అంతర్గత పనుల కోసం రూ.980.34 కోట్లకు ప్రభుత్వం పరిపాలన అనుమతుల్ని వేర్వరుగా ఇచ్చింది. ఈ మేరకు హైకోర్టు భవనంలో పనులకు రూ.556 కోట్లు, అసెంబ్లీ భవనంలో పనులకు రూ.424.34 కోట్లు ఇచ్చారు. ఈ నిధులతో ఎలక్ట్రికల్, అగ్నిమాపక వ్యవస్థలు, లిఫ్ట్‌లు తదితర అంతర్గత పనులు చేపడతారు.

Related Videos