ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన ఎన్టీఆర్ను అప్పటి రాజకీయ దుష్టశక్తులు కొన్ని ఆ మహానేతను పదవీచ్యుతుడిని చేశాయి. ఆ సందర్భంగా కాంగ్రేసేతర రాజకీయ పార్టీలు ఆయనకు అండగా నిలిచాయి. యావత్ రాష్ట్రం ఆయననే అనుసరించింది. ఆయన తిరిగి సీఎం అయ్యేంత వరకు అన్ని వర్గాలూ ఆయన వెంటే నడిచాయి. ఈ సందర్భంగా చెలరేగిన ప్రజా ఉద్యమం దేశంలోని కాంగ్రెసేతర పక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు మార్గం సుగమం చేసింది.
ఇలా 1984లో ఎన్టీఆర్ ప్రభుత్వం బర్తరఫ్ తర్వాత సాగిన ఉద్యమంలోని ప్రధాన ఘట్టాలు, దానికి దారితీసిన పరిస్థితులను టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఛైర్మన్ టి.డి జనార్దన్ అక్షరబద్ధం చేశారు. దానిని ‘సజీవ చరిత్ర’ పేరుతో పుస్తక రూపంలోకి తీసుకొచ్చారు. ఈ పుస్తకాన్ని ఇవాళ మంగళవారం విజయవాడ శివారు కృష్ణా జిల్లా పోరంకిలోని మురళీ రిసార్ట్స్లో ఆవిష్కరించనున్నారు. ముఖ్య అతిథులుగా సీఎం చంద్రబాబు, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, త్రిపుర గవర్నర్ ఎన్.ఇంద్రసేనారెడ్డి, ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ హాజరుకానున్నారు. 1982 మార్చి 21న హైదరాబాద్లోని రామకృష్ణా స్టూడియోలో నందమూరి తారక రామారావు విలేకరుల సమావేశం నిర్వహించి, ప్రజాసేవ నిమిత్తం తాను రాజకీయాల్లో వస్తున్నట్లు ప్రకటించిన నాటి నుంచి చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలను ఈ పుస్తకంలో వివరించారు టీడీ జనార్ధన్. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నాదెండ్ల భాస్కరరావు, ఆయనతో పాటు కొందరు ప్రజాప్రతినిధులు, నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. పార్టీ పెట్టిన తర్వాత రాష్ట్రం మొత్తం ఎన్టీఆర్ సుడిగాలిలా తిరిగారు.
ఎన్టీఆర్ హవాను అడ్డుకునేందుకు కేంద్రం ఎన్నికలను ముందుకు తీసుకువచ్చింది. అయినా ఆయన హవాను అడ్డుకోలేకపోయింది. అఖండ మెజార్టీతో టీడీపీ గెలవడం, ఎన్టీఆర్ సీఎం కావడం చకచకా జరిగిపోయాయి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్టీఆర్ మంత్రిమండలిలో ఆర్థిక మంత్రి నాదెండ్ల భాస్కరరావు అంతర్గత రాజకీయాలను, ఆయన కేంద్రంతో చేతులు కలిపిన తీరును ఇందులో వివరించారు. అమెరికా వెళ్లిన తర్వాత అప్పటి గవర్నర్ రామ్లాల్ ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయడం, నాదెండ్లను సీఎం చేయడంతో ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం ప్రారంభమైంది.
ఇలాంటి వివరాలతో పాటు హస్తినలో జరిగిన అనేక సంఘటనలను ఈ పుస్తకం వివరిస్తుంది. వాటిలో ఎన్టీఆర్ వర్గం ఎమ్మెల్యేలతో బలప్రదర్శన, శిబిరాల ఏర్పాటు, చివరికి ఎన్టీఆర్ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వరకు సాగిన ఎన్నో ఘట్టాలను పుస్తకంలో వివరించారు. ఉద్యమానికి సంబంధించి పత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగులు, ఫొటోలను ఈ పుస్తకంలో పొందుపర్చారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos