ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురైన వైఎస్సార్సీపీకి... వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. ఆ పార్టీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా దక్కని విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు అసెంబ్లీలో కీలకమైన పీఏసీ ఛైర్మన్ పదవిపై చర్చ మొదలైంది. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఎన్నికకు సంబంధించిన ప్రక్రియను మొదలు పెట్టారు. దీంతో ఈ పదవి వైఎస్సార్సీపీకి దక్కుతుందా లేదా అనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో కీలకమైన పబ్లిక్ ఎకౌంట్స్ కమిటీ (ప్రజాపద్దుల కమిటీ) ఛైర్మన్ పదవి వైఎస్సార్సీపీకి దక్కాలంటే 18మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి. కానీ ఆ పార్టీకి కేవలం 11మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. దీంతో పీఏసీ ఛైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందోనని చర్చ జరుగుతోంది.
అసెంబ్లీలో ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) సభ్యుల ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైన క్రమంలో ... ఈరోజు అంటే గురువారం మధ్యాహ్నం ఒంటిగంట వరకు నామినేషన్లు దాఖలు చేసుకునేందుకు అవకాశం ఉంది.. ఒకవేళ అవసరమైతే ఎన్నిక కూడా ఉంటుంది. ఈ పీఏసీ కమిటీలో 12 మంది సభ్యులు ఉంటారు.. శాసనసభ నుంచి 9మంది, మండలి నుంచి ముగ్గురు సభ్యులుగా ఉంటారు. శాసనసభ నుంచి ఛైర్మన్ను నియమించనుండగా స్పీకర్ తుది నిర్ణయం తీసుకుంటారు.
గత ప్రభుత్వంలో ప్రతిపక్ష తెలుగుదేశానికి ఒక్క సభ్యుడిని ఎన్నుకునేంత బలం ఉండటంతో పీఏసీ ఛైర్మన్గా పయ్యావుల కేశవ్కు అవకాశం దక్కింది. సంప్రదాయం ప్రకారం స్పీకర్ ప్రతిపక్ష ఎమ్మెల్యేకు ఛైర్మన్గా అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీకి ఉన్న బలాన్ని బట్టి చూస్తే.. ఒక్క సభ్యుడూ ఎన్నికయ్యే ఆస్కారం లేదనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ పీఏసీ ఛైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ వైఎస్సార్సీపీకి కనుక ఈ పదవి దక్కకపోతే.. జనసేన నుంచి ఎవరికైనా పదవి దక్కుతుందా అనే చర్చ కూడా మొదలైంది. అసెంబ్లీ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మరి చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos