ఈ ఏడాది ఏపీ రాష్ట్రంలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ సీట్ల కోసం కూటమి పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది. అలాగే కూటమిని నడుపుతున్న టీడీపీలో అయితే ఇది మరి కాస్త ఎక్కువగానే ఉంది. ఇలాంటి సమయంలో రోజుకో కొత్త పేరు తెరపైకి వస్తోంది. ఇందులో సామాజిక వర్గాల లెక్కలు, స్థానిక సమీకరణాలు, చంద్రబాబు గతంలో ఇచ్చిన హామీలు.. ఇలా పలు అంశాలు మిళితమై కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో అనూహ్యంగా మరో కొత్త పేరు రాజ్యసభ అభ్యర్ధుల రేసులోకి వచ్చింది.
కూటమికి, అందులోనూ టీడీపీకి అత్యంత ముఖ్యమైన నగరాల్లో విజయవాడ కూడా ఒకటి. ఇక్కడ స్థానికంగా కాపు రాజకీయాల్ని ప్రభావితం చేసే వ్యక్తుల్లో వంగవీటి రాధా కూడా ఒకరు. చాలా కాలం నుంచి టీడీపీలోనే ఉంటున్నా ఆయనకు ఎలాంటి పదవీ లభించలేదు. అలాగే గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఆ తర్వాత నామినేటెడ్ పదవుల పంపకాల్లోనూ రాధాను పట్టించుకోలేదు. దీంతో ఇక రాధా పని ముగిసినట్లే అని అనుకుంటున్న తరుణంలో తాజాగా ఆయన రాజ్యసభ రేసులోకి వచ్చారు. ఇప్పటికే టీడీపీ నుంచి టీడీ జనార్ధన్, భాష్యం రామకృష్ణ, సిట్టింగ్ ఎంపీ సానా సతీష్ బాబుతో పాటు పలు పేర్లు రాజ్యసభ రేసులో ఉన్నాయి. ఇలాంటి సమయంలో వీళ్లలో లోకేష్ కు సన్నిహితుడైన సానా సతీష్ ను పూర్తి పదవీకాలం దక్కకపోవడంతో కొనసాగింపు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మరో సీటుకు చంద్రబాబు వంగవీటి రాధా పేరును పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీని వెనుక పలు కీలక కారణాలు కనిపిస్తున్నాయి.
ఇందులో కాపు సామాజిక వర్గానికి మరింత దగ్గర కావడం ద్వారా వచ్చే ఎన్నికల్ని కూడా నల్లేరుపై నడకగా మార్చుకోవాలని చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా వంగవీటి రాధాకు రాజ్యసభ సీటును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ రాధాను ఎన్నికల్లో ప్రచారాలకు వాడుకుని వదిలేస్తున్నారన్న అపప్రథ నుంచి బయటపడి ఆయనకు పార్టీలో సముచిత స్ధానం ఇచ్చి రాజ్యసభకు పంపాలని భావిస్తున్నట్లు సమాచారం. అలాగే రాధాను రాజ్యసభకు పంపితే విజయవాడతో పాటు మిగతా కోస్తా జిల్లాల్లో కూడా కాపులు టీడీపీకి మరింత దగ్గరయ్యే అవకాశాలున్నాయని, ఇదో గేమ్ ఛేంజర్ నిర్ణయం అవుతుందని పార్టీలోనూ, బయటా చర్చించుకుంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos