ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి నారా లోకేష్ ఈ ఫలితాలను విడుదల చేయగా.. పరీక్ష రాసిన విద్యార్థుల్లో 81.14 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు విద్యాశాఖ ప్రకటించింది. విద్యార్ధులు తమ ఫలితాలను అధికారిక వెబ్ సైట్స్ https://bse.ap.gov.in, https://apopenschool.ap.gov.in/ లలో మాత్రమే కాకుండా పలు సైట్స్ లలో కూడా చెక్ చేసుకోవచ్చు. అంతే కాకుండా ఈ ఏడాది 'మన మిత్ర' (వాట్సాప్) ద్వారా కూడా చెక్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. వాట్సాప్ లో 9552300009 నంబర్కు "Hi" అని మెసేజ్ పంపి, విద్యా సేవలను ఎంచుకుని, ఆపై SSC పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఎంచుకుని, వారి రోల్ నంబర్ను నమోదు చేయడం ద్వారా వారి ఫలితాల PDF కాపీని పొందవచ్చు.
అలానే సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వారి పాఠశాల లాగిన్ల ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతే కాకుండా LEAP మొబైల్ యాప్ ఉపాధ్యాయులు, విద్యార్థుల లాగిన్ల ద్వారా కూడా ఫలితాలు పొందే సౌలభ్యం కల్పించారు. ఈ ఏడాది మొత్తం 6,19,275 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. వీరి జవాబు ప్రశ్నాల మూల్యాంకనం ఏప్రిల్ 15 నాటికి పూర్తి చేశారు. అనంతరం ఫలితాల కంప్యూటరీకరణ ప్రక్రియ పూర్తి చేసారు. ఇక ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా 93.90% ఉత్తీర్ణత రేటుతో మొదటి స్థానంలో ఉంది. చివరి స్థానంలో అల్లూరి సీతారామరాజు జిల్లా 47.64 శాతంతో పరిమితమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,680 పాఠశాలల్లోని విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించారు. అమ్మాయిలు 84.09 శాతం, అబ్బాయిలు 78.31 శాతం ఉత్తీర్ణత సాధించారు. అబ్బాయిల కంటే అమ్మాయిలు 5 శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించారని, రాష్ట్రవ్యాప్తంగా 16 పాఠశాలల్లో ఒక్కరు కూడా పాస్ కాలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు మే 19 నుంచి 28, వరకు నిర్వహించనున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు. సప్లిమెంటరీ ఫీజు ఈ నెల 24 నుంచి 30 వ తేదీ వరకు అదనపు రుసుము చెల్లించకుండా ఫీజులు చెల్లించుకోవచ్చని తెలిపారు. అదనపు రుసుము రూ.50తో.. మే 18వ తేదీ వరకు చెల్లించవచ్చని అధికారులు తెలిపారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos