ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ ఇవాళ భేటీ కానుంది. ఈ కేబినెట్ భేటీలో కీలక అంశాలపై చర్చించి, వాటికి ఆమోదం తెలపనున్నారు. వైజాగ్ మిలీనియం టవర్స్ లో రూ. 80 కోట్ల పెట్టుబడితో 2,08,280 చదరపు అడుగుల విస్తీర్ణంలో టీసీఎస్ సంస్థ ఏర్పాటుపై కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే క్లీన్ ఎనర్జీలో భాగంగా కొత్తగా ఐదు సంస్థల ఏర్పాటు విషయమై రూ. 83 వేల కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలపనుంది.
అలాగే ఇంకా మరికొన్ని అంశాలపై చర్చించి ఆమోదం తెలుపుతున్నట్లు సమాచారం. కాకినాడలో ఏఎం గ్రీన్ అమ్మోనియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి 592 ఎకరాల్లో రూ. 12,000 కోట్ల పెట్టుబడులకు... కర్నూలు జిల్లా హోసూరు, పెద్ద హుల్తిలో టాటా పవర్ రెన్యువబుల్ ఎనర్జీ లిమిటెడ్ 1,800 ఎకరాల్లో రూ. 2 వేల కోట్లతో ఏర్పాటు చేయనున్న 400 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలపనున్నది. అదేవిధంగా కడప జిల్లాలో కొండాపురం, మైలవరంతో పాటు నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలో క్లీన్ ఎనర్జీ హైబ్రిడ్ త్రీ ప్రైవేట్ లిమిటెడ్ 1,080 ఎకరాల్లో రూ. 2 వేల కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదించనుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 65 వేల కోట్ల పెట్టుబడులతో 11 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి, జాన్ కోకిరిల్ గ్రీన్ కో హైడ్రోజన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కాకినాడలో రూ. 2 వేల కోట్ల పెట్టుబడులతో 40 ఎకరాల్లో 2 గిగావాట్ల సామర్థ్యం కలిగిన ఎలక్ట్రోలైజర్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు, సత్యసాయి జిల్లా గుడిపల్లిలో ఆజాద్ మొబిలిటీ ఇండియా సంస్థ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ట్రక్కులు, బస్సులు, బ్యాటరీ ప్యాక్ ల కోసం రూ. 1,046 కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం అంగీకరించనుంది.
అలాగే అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో 106 ఎకరాల్లో బాలాజీ యాక్షన్ బిల్డ్ వెల్ సంస్థ రూ. 1,174 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు, నెల్లూరు జిల్లా రామయ్యపట్నంలో 6 వేల ఎకరాల్లో రూ. 96,862 కోట్ల పెట్టుబడులతో బీపీసీఎల్ భారీ రిఫైనరీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలుపనున్నట్లు సమాచారం. కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఈ భేటీలో గడిచిన ఆరు నెలల పాలన, 2025 ఏడాది పాలనలో తీసుకురావాల్సిన మార్పులపై మంత్రులకు చంద్రబాబు దిశా నిర్దేశం చేయనున్నారని తెలుస్తోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos