ఏపీలో కొత్త జిల్లా ఏర్పాటు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఏపీ కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు - మంత్రుల మధ్య ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. 2024 ఎన్నికల సమయంలో జిల్లాల పునర్విభజన అంశంపై చర్చ జరిగింది. ఈ మేరకు కూటమి ఇచ్చిన హామీలపై నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. కూటమిలోని మూడు పార్టీల నేతలతో పాటుగా వివిధ సంఘాల వారిని భాగస్వాముల్ని చేసి నివేదిక రూపొందించాలన్నారు. మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లాతో పాటుగా పోలవరం ముంపు మండలాలు, ప్రత్యేక జిల్లాల ఏర్పాటు వంటి హామీల అమలు వేగవంతం చేయాలని సూచించారు. ఈ క్రమంలో ప్రధానంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అంశాలపై ఫోకస్ పెట్టబోతున్నారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుతో పాటుగా మరికొన్ని మార్పులు, చేర్పులు కూడా ఖాయమనే చర్చ జరుగుతోంది. బాపట్ల, నెల్లూరు జిల్లాలలో కలిపిన కొన్ని నియోజకవర్గాలను తిరిగి ప్రకాశంలో కలపడానికి పరిశీలన చేస్తున్నారు. దీనిపై మంత్రుల కమిటీ వేసి, అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. బాపట్ల జిల్లాలో కలిసిన అద్దంకి నియోజకవర్గం, నెల్లూరు జిల్లాలో కలిసిన కందుకూరు నియోజకవర్గాలను తిరిగి ప్రకాశం జిల్లాలో కలిపేందుకు కసరత్తు ప్రారంభించనున్నారు. అద్దంకి ఒంగోలుకు దగ్గరగా ఉంటుంది.. కేవలం 37 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే ప్రతి 15 నిమిషాలకు బస్సు ఉండటంతో 45 నిమిషాల్లో చేరుకోవచ్చు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన జిల్లాల పునర్విభజనలో భాగంగా అద్దంకిని బాపట్ల జిల్లాలో కలిపారు. దీంతో అద్దంకి ప్రజలు బాపట్లకు వెళ్లాలంటే 90 కిలోమీటర్ల దూరం ఉంది. అక్కడికి వెళ్లాలంటే మార్టూరు లేదా ఇంకొల్లు మీదుగా చీరాల వెళ్లి అక్కడి నుంచి బాపట్ల చేరుకోవాలి. ఇది చాలా ఇబ్బందిగా మారింది.. వ్యయ ప్రయాసలతో కూడిన అంశం.
ఇటుచూస్తే కందుకూరు కూడా ఒంగోలుకు దగ్గరే.. 48 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో దీనిని నెల్లూరు జిల్లాలో కలిపారు. కానీ నెల్లూరు 113 కిలోమీటర్ల దూరంలో ఉంది.. రవాణా పరంగా చూస్తే కందుకూరు ఒంగోలుకు దగ్గరగా ఉంటుంది. ఈ నియోజకవర్గాలను తిరిగి ప్రకాశంలో కలిపితే ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు. అటు అద్దంకి, ఇటు కందుకూరు నియోజకవర్గాలను తిరిగి ప్రకాశం జిల్లాల్లో కలపాలని డిమాండ్ ఉంది.. ఈ మేరకు కూటమి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేస్తోంది. ఈ క్రమంలో గిద్దలూరు, కనిగిరి, యర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గాలతో కొత్త మార్కాపురం జిల్లా ఏర్పాటు అంశం.. కందుకూరు, అద్దంకి నియోజకవర్గాలను తిరిగి ప్రకాశం జిల్లాలో కలపడంపై మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేయనుంది. సాధ్యాసాధ్యాలను క్షుణ్ణంగా పరిశీలించి త్వరగా నివేదిక రూపొందిస్తారని అంటున్నారు.
మరోవైపు యర్రగొండపాలెం, పుల్లలచెరువు, మార్కాపురం, గిద్దలూరు ప్రాంతాల ప్రజలు జిల్లా కేంద్రమైన ఒంగోలుకు
చాలా దూరం ప్రయాణం చేయాల్సి వస్తోంది. దాదాపు 95 నుంచి 155 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి ఒంగోలు వెళ్లాలంటే చాలా కష్టంగా ఉంది. ప్రజలు సమస్యల కోసం, ఉద్యోగులు పనుల కోసం వెళ్లాలన్నా చాలా సమయం పడుతోంది. దీనివల్ల పశ్చిమ ప్రకాశం ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదు.. అందుకే మార్కాపురాన్ని జిల్లా చేస్తే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో కూడా స్థానికులు నిరాహార దీక్షలు, ధర్నాలు చేశారు. ఎన్నికల సమయంలో స్వయంగా చంద్రబాబు మార్కాపురం కొత్త జిల్లా ఏర్పాటుపై హామీ ఇచ్చారు. తాజాగా ఆ ఎన్నికల హామీ అమలు దిశగా అడుగులు పడుతున్నాయి. అలాగే పుంగనూరు నియోజకవర్గాన్ని అన్నమయ్య జిల్లాలో కలిపేందుకు ప్రతిపాదనలు వచ్చాయి. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మరి చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos