ఏపీ ప్రభుత్వం టీమిండియా మహిళా క్రికెటర్ శ్రీచరణికి నగదు ప్రోత్సాహకం అందజేసింది. ఇటీవల ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్లో రాణించి, విజయంలో కీలకపాత్ర పోషించిన శ్రీచరణిని ప్రభుత్వం ఘనంగా సత్కరించింది.. ఆమెకు నగదుతో పాటుగా ఇంటి స్థలం వంటి ప్రోత్సాహకాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవాళ మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో శ్రీచరణికి రూ.2.5 కోట్ల చెక్ను అందజేశారు. అంతేకాదు ప్రభుత్వం 500 గజాల విస్తీర్ణంలో ఇంటి స్థలాన్ని కూడా కేటాయించింది.
శ్రీచరణి డిగ్రీ పూర్తి చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో గ్రూప్-1 హోదా ఉద్యోగం కూడా ఇవ్వనుంది. ఇటీవల ఏపీ కేబినెట్ సమావేశంలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. తాజాగా నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. 'మహిళల వన్డే ప్రపంచ కప్లో అద్భుత ప్రదర్శన చేసిన రాష్ట్రానికి చెందిన మహిళా క్రికెటర్ శ్రీచరణికి కూటమి ప్రభుత్వం ప్రకటించిన రూ.2.5 కోట్ల నగదు ప్రోత్సాహకాన్ని ఉండవల్లి నివాసంలో అందజేశాను. ఈ కార్యక్రమంలో రవాణా, యువజన క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు గారు పాల్గొన్నారు' అంటూ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు.
తెలుగమ్మాయి శ్రీచరణి ఇటీవల నిర్వహించిన డబ్ల్యూపీఎల్ మెగా వేలంలో భారీ ధరకు ఢిల్లీ దక్కించుకుంది. కనీస ధర రూ.30 లక్షలు కాగా.. ఆమె రూ.1.30 కోట్లతో ఢిల్లీ టీమ్లో చేరారు. టీమిండియా శ్రీలంకతో ఐదు టీ20ల సిరీస్ ఈ నెల 21 నుంచి ప్రారంభం అవుతుంది. ఈ టీమ్లోకి తెలుగమ్మాయి శ్రీచరణి కూడా ఎంపికయ్యారు. మరో తెలుగమ్మాయి అరుంధతి రెడ్డికి కూడా స్థానం దక్కింది. ఈ టీ-ట్వంటీ సిరీస్ తొలి రెండు మ్యాచ్లు విశాఖపట్నంలోనే జరగనున్నాయి. శ్రీ చరణి సొంతూరు ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా వీరపనేని మండలం ఎర్రమల్లె గ్రామం.. ఆమె తండ్రి చంద్రశేఖర్ రెడ్డి రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్లో ఉద్యోగి. ఆమె స్పిన్ బౌలర్గా రాణిస్తూ టీమిండియాకు ఎంపికయ్యారు. ఉమెన్స్ వరల్డ్కప్లో తన బౌలింగ్తో అదరగొట్టారు. చరణి 9 మ్యాచ్ల్లో 78 ఓవర్లు వేసి 14 వికెట్లు తీసి రాణించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos