ఏపీలో సంక్రాంతి ప్రయాణికుల రద్దీని క్యాష్ చేసుకునేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ రంగంలోకి దిగిపోయాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దూర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికుల్ని బాదేయడం మొదలుపెట్టేశాయి. చాలా చోట్ల విమాన ప్రయాణాలతో సమానంగా టికెట్ రేట్లు పెంచేశారు. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఎక్కాలంటే భయపడే పరిస్ధితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రవాణాశాఖ పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో సర్కార్ రంగంలోకి దిగింది.
సంక్రాంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా భారీగా ఛార్జీలు పెంచి ప్రయాణికుల్ని దోచుకుంటున్న ట్రావెల్స్ బస్సులపై ఇవాళ్టి నుంచి కొరడా ఝళిపిస్తోంది. ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ నియంత్రణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా భారీ ఎత్తున తనిఖీలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేక బృందాల్ని కూడా రవాణాశాఖ నియమించింది. అలాగే ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో అధిక ఛార్జీల వసూళ్లపై నేరుగా ప్రయాణికులు ఫిర్యాదు చేసేందుకు వీలుగా ఓ టోల్ ఫ్రీ నంబర్ ను సైతం రవాణాశాఖ ప్రారంభించింది. ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ 9281607001 ను సంప్రదించాలని ప్రయాణికుల్ని కోరుతోంది.
ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలపై ఫిర్యాదులు వస్తే సంబంధిత ట్రావెల్స్ పై చర్యలు తప్పవని రవాణాశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో వేల సంఖ్యలో నడుస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఇప్పటికే మోటారు వాహన చట్టంలోని నిబంధనలు ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా నడుస్తున్నాయి. దీనిపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నా కొత్త కొత్త విధానాల్లో, చట్టాల్లో లొసుగులు వాడుకుంటూ చెలరేగిపోతున్నారు. దీంతో రవాణా శాఖ అధికారులు కఠినంగా వ్యవహరించే దిశగా అడుగులు వేస్తున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos