ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత కార్మికులకు శుభవార్త చెప్పింది. వేలాది మంది చేనేతలకు లబ్ధి చేకూర్చే విధంగా వేతనాలు, ప్రాసెసింగ్ చార్జీలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించడానికి ఎగ్జిబిషన్లు, కొనుగోలుదారుల సమావేశాలు ఏర్పాటు చేస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 50 ఏళ్లకే పింఛను అందిస్తోంది. హస్త కళాకారుల ప్రతిభను ప్రోత్సహించడానికి కొత్త డిజైన్ల పోటీలు నిర్వహించనుంది. ఆప్కో, లేపాక్షి పనితీరు మెరుగుపరచడానికి IIM విశాఖపట్నంతో ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా ఒక్కో కార్మికుడికి నెలకు రూ.3 వేల వరకు అదనపు ఆదాయం వస్తుంది. ఈ వివరాలను బీసీ, చేనేత, టెక్స్టైల్స్ శాఖ మంత్రి సవిత వెల్లడించారు.
వేతనాల పెంపు ఏ మేరకు ఉంటుందనే విషయాన్ని మంత్రి వివరించారు. టవల్ నేత మజూరి రూ.31 నుంచి రూ.40కి పెరిగింది (30% పెంపు).బెడ్షీట్ నేత మజూరి రూ.83 నుంచి రూ.100కి పెరిగింది (20% పెంపు).బ్లీచింగ్ ఛార్జీలు బండిల్కు రూ.129 నుంచి రూ.148కి పెరిగాయి (15% పెంపు).డైయింగ్ ఛార్జీలు బండిల్కు రూ.362 నుంచి రూ.434కి పెరిగాయి (20% పెంపు).
అంతేకాదు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు.. 92,274 మంది నేతన్నలకు నెలకు రూ.4 వేల చొప్పున పింఛను అందిస్తున్నట్లు మంత్రి సవిత తెలిపారు. చేనేతలకు 50 ఏళ్లకే పింఛను ఇస్తున్నామన్నారు. మరమగ్గాలకు 500 యూనిట్లు, చేతి మగ్గాలకు 200 యూనిట్ల విద్యుత్ను ఉచితంగా ఇస్తున్నామన్నారు. చేనేత కార్మికులు, హస్తకళాకారుల ప్రతిభను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కొత్త డిజైన్ల కోసం పోటీలు నిర్వహిస్తోందన్నారు మంత్రి. బెస్ట్ డిజైన్లకు రూ.5 లక్షల బహుమతి ఇస్తామన్నారు. ఈ నెల 17 నుంచి 30 రోజుల పాటు డిజైన్లను స్వీకరిస్తారన్నారు. విశాఖపట్నం ఐఐఎంతో ఆప్కో, లేపాక్షి సంస్థల పనితీరును మెరుగుపర్చేందుకు ఒప్పందం కుదుర్చుకుందని అన్నారు. పీపీపీ విధానంలో ఇతర రాష్ట్రాల్లో లేపాక్షి షోరూమ్లను ఏర్పాటు చేస్తున్నట్తు తెలిపారు. ఆప్కో, లేపాక్షి దుకాణాల్లో రెండు సంస్థల ఉత్పత్తులు అందుబాటులో ఉంచేలా ఒప్పందం చేసుకున్నారు. మొత్తం మీద చేనేతల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని ఆ వర్గాల వారిలో హర్షం వ్యక్తమవుతోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos