ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ సోమవారం పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. పరీక్షల సమయంలో విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికావద్దని, ప్రశాంతమైన మనసుతో పరీక్షలు రాయాలని లోకేశ్ సూచించారు. ‘ఒత్తిడికి గురికావద్దు. ప్రశాంతంగా ఉండండి. 100 శాతం మీ ప్రతిభను ప్రదర్శించే సమయం. ప్రణాళికాబద్ధంగా పరీక్షలు రాయండి. విజయం మీదే. ఆల్ ది బెస్ట్’ అని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. విద్యార్థులు తమ పూర్తి ప్రతిభను కనబరిచి మంచి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కాగా, ఇవాళ మార్చి 16న ప్రారంభమైన ఈ పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 1వ తేదీ వరకు కొనసాగనున్నాయి. కాగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6,40,916 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. వీరి కోసం 3,415 పరీక్షా కేంద్రాలను విద్యాశాఖ ఏర్పాటు చేసింది. పరీక్షలు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:45 గంటలకు ముగుస్తాయి. మొత్తం విద్యార్థుల్లో 6,22,074 మంది రెగ్యులర్, 18,842 మంది ప్రైవేటు అభ్యర్థులు ఉన్నారు. వీరిలో 3,28,652 మంది బాలురు, 3,12,264 మంది బాలికలు ఉన్నారు. పరీక్షల నిర్వహణకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఇందుకోసం 38,958 మంది ఇన్విజిలేటర్లను నియమించారు.
మాల్ ప్రాక్టీస్ను అరికట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా 156 ఫ్లయింగ్ స్క్వాడ్లను రంగంలోకి దించారు. వీటితో పాటు 210 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించి, అక్కడ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఉదయం 8:30 గంటల నుంచే పరీక్షా కేంద్రంలో రిపోర్ట్ చేయాలని అధికారులు సూచించారు. ఉదయం 10 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ లోనికి అనుమతించబోమని స్పష్టం చేశారు. పరీక్షా హాల్లోకి ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, క్యాలిక్యులేటర్ల వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించమని విద్యాశాఖ పేర్కొంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos