ప్రధాని మోదీ ఈ నెల 8న విశాఖలో పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారులు ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించారు. ఇదే సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్న క్రమంలో ... ప్రధాని మోదీ విశాఖ పర్యటన సమయంలో కేంద్రం స్టీల్ ప్లాంట్ పైన కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. స్టీల్ ప్లాంట్ కు రూ.17 వేల కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటనకు సిద్దం అయినట్లు సమాచారం. అయితే, ప్లాంట్ కు నిధులుగా కాకుండా టెక్నాలజీ రూపంలో ఇవ్వాలని భావిస్తున్న ట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం విశాఖ ప్లాంటులో మూడు బ్లాస్ట్ ఫర్నేసుల ద్వారా స్టీల్ తయారు చేస్తున్నారు. ప్లాంట్ కు ఉన్న ఆర్దిక ఇబ్బందులతో ముడి పదార్ధాలను సమకూర్చుకోవటం సమస్య గా మారుతోంది. దీంతో, రెండు బ్లాస్ట్ ఫర్నేసులనే నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో కొత్తగా మూడు ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేసుల ఏర్పాటు కోసం నిధులు ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. ఈ కొత్త ఫర్నేసుల ఏర్పాటు కోసం ఒక్కొక్క దానికి రూ.2,500 కోట్ల నుంచి రూ.3 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా. మూడింటికీ రూ.7,500 కోట్లు అవసరమని అంచనా వేస్తున్నారు. వీటి ద్వారా నాణ్యమైన ఉక్కు ఉత్పత్తి చేస్తారు. ఈ మేరకు కావాల్సిన సాంకేతిక సాయం అందించేందుకు పోస్కో కంపెనీ పేరు పరిశీలనలో ఉందని తెలుస్తోంది. ఈ సంస్థ నాలుగేళ్ల క్రితమే విశాఖ ఉక్కుతో జాయింట్ వెంచర్ కోసం ప్లాంటులో 1,500 ఎకరాలు కేటాయిస్తే స్టీల్ ఉత్పత్తి చేసి, లాభాల్లో వాటా ఇస్తామని అప్పట్లో ప్రతిపాదన చేసింది.
కానీ, కార్మిక సంఘాలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాయి. ప్లాంట్ ప్రయివేటీకరణ లో భాగంగా ఈ ప్రతిపాదన చేస్తున్నారని నిరసనలకు దిగాయి. దీంతో, ఈ ఆలోచన అమలు కాలేదు. కాగా, ఇప్పుడు కేంద్రం విశాఖ ఉక్కులో ప్రైవేటు భాగస్వామ్యంతో ఉత్పత్తి పెంచాలని భావిస్తోంది. దీని కోసం కొత్త టెక్నాలజీ వినియోగం పైన ఫోకస్ చేసింది. అయితే, కేంద్రం తీసుకొచ్చే కొత్త ఫర్నేసుల తో పెద్దగా ఉత్పత్తి పెరిగే అవకాశం లేదని కార్మికులు చెబుతున్నారు. ప్లాంట్ కు కావాల్సిన ఆర్దిక సాయం చేయకుండా తాజా ప్రతిపాదనలతో ఉపయోగం ఉండదని వాదిస్తున్నారు. ఈ ప్యాకేజీ పేరుతో మరోసారి పోస్కోను తీసుకొస్తున్నారని మండిపడుతున్నారు. దీంతో, ఇప్పుడు కేంద్రం ఈ ప్యాకేజీ ప్రతిపాదన పైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos