వెలగపూడి సచివాలయంలో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ భేటీలో పలు కీలక ప్రతిపాదనలపై సీఎం చంద్రబాబు నేతృత్వంలోని మంత్రి మండలి చర్చించి ఆమోదించనున్నట్లు తెలుస్తోంది. అమరావతి నిర్మాణం, జీఏడీ టవర్లు, హెచ్వోడీ టవర్ల టెండర్లకు ఆమోదం తెలిపే అవకాశంఉంది. మరోవైపు తల్లికి వందనం పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.15000 వేసే అంశం…నిధుల విడుదలపైనా చర్చించే అవకాశం ఉంది. ఇంకో వైపు అత్యంత ప్రతిష్టాత్మకంగా జూన్ 5న ప్రారంభించబోతున్న కోటి మెుక్కలు నాటే కార్యక్రమంపై మంత్రి మండలి సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అంతేకాదు రాష్ట్రంలో ఐఏఎస్…ఐపీఎస్ల బదిలీలపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రాజధాని అమరావతి కోసం మరో 44 వేల ఎకరాల భూమిని సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో భూసమీకరణపై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భూములలో 5 వేల ఎకరాల్లో అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిర్మాణం చేపట్టనుంది. అలాగే 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ వంటి నిర్మాణాలపైనా ఏపీ కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. 2,500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్ నిర్మాణం జరగనుంది.
మరోవైపు ఈ నెల 21న విశాఖపట్నంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ హాజరుకానున్నారు. ప్రధాని పర్యటనపైనా మంత్రి మండలిలో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ఇక అన్నింటి కంటే ముఖ్యంగా తల్లికి వందనం పథకంపై ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకునే వీలుంది. ఈ విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15000 అందిస్తామని టీడీపీ కూటమి ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. జూన్ 12 లేదా జూన్ 15వ తేదీన తల్లికి వందనం పథకం కింద రూ.15000 విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో వేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పథకం అమలుకు సంబంధించి నిధులపై చర్చ జరిగే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే జూన్ ఐదో తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో కోటి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టనున్నారు. దీనిపైనా సీఎం చంద్రబాబు చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలకు పలు సూచనలు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అవుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇందులో భాగంగా ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది.10 జిల్లాలకు పైగా కలెక్టర్లు, 8 జిల్లాలకు పైగా ఎస్పీలు బదిలీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారుల బదిలీలపై సైతం ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ అంశంపై నేడు ఏపీ కేబినెట్ చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos