ఏపీ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఇవాళ.. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. వివిధ శాఖలకు చెందిన పలు ప్రతిపాదనలపై కేబినెట్ మీటింగ్లో చర్చించనున్నారు. టెక్ హబ్ ల్యాండ్ ఇన్సెంటివ్ పాలసీకి అదనపు నిబంధనలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. హంద్రీ-నీవా ప్రాజెక్ట్లో అమిడ్యాల లిఫ్ట్ స్కీమ్కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. మరోవైపు.. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనపై మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.
ఈ నెల 16న జరగనున్న ప్రధాని పర్యటనకు సంబంధించి భద్రతా ఏర్పాట్లు, ప్రజాసంబంధాల ప్రణాళికలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రదర్శన వంటి అంశాలపై చర్చించనున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా రాష్ట్రానికి మరిన్ని కేంద్ర నిధులు సమకూర్చుకునే అవకాశాలను సీఎం పరిశీలించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అదేవిధంగా ప్రకాశం బ్యారేజ్ - దివిసీమ ప్రాంతాల్లో వరద నష్టం మరమ్మతులకు అనుమతితో పాటు, మైలవరం డ్యాం గేట్ల బలోపేత పనులకు, తిరుమల- తిరుపతి తాగునీటి సరఫరా కోసం 126 కోట్ల ప్రాజెక్ట్ పనులకు కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలపనున్నారు. అనంతపురం జిల్లాలోని ఉరవకొండ-వజ్రకరూరు కు కొత్త లిఫ్ట్ స్కీమ్కు, మిడ్ పెన్నా ప్రాజెక్ట్లో గేట్ల రీప్లేస్మెంట్, బ్యూటిఫికేషన్ పనులకు పర్మిషన్ ఇవ్వనున్నారు. ఆటో, క్యాబ్ డ్రైవర్లకు 15 వేల రూపాయల వార్షిక ఆర్థిక సహాయం ర్యాటిఫికేషన్, ఏపీ టూరిజం పాలసీలో కారవాన్ టూరిజం, హోమ్ స్టే ప్రోత్సాహకాలు చేర్పు, అమృత్ పథకం 2.0 కింద 10,319 కోట్లతో 281 ప్రాజెక్టులకు రివైజ్డ్ ఆమోదానికి సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు.
అమరావతి ప్రాజెక్టుల కోసం ప్రత్యేక SPV ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే కేబినెట్ సమావేశంలో రాజధాని ప్రాజెక్ట్ భూమి సేకరణకు న్యాయ పరిరక్షణ మినహాయింపులు, గుంటూరు లామ్ రీజినల్ పౌల్ట్రీ ఫార్మ్ భూములపై వివాద పరిష్కారం, ఎండోమెంట్స్ చట్టం 19వ సెక్షన్లో "కుష్టురోగం" పదం తొలగింపు బిల్లు, ఏపీ-సర్వే ఆఫ్ ఇండియా మధ్య MoU కు అనుమతి, ఎప్ట్రాన్స్కో ఆదేశాల్లో మార్పుల ప్రతిపాదనపై చర్చ జరగనుంది. గ్రీన్ హైడ్రజన్ ప్రోత్సాహకానికి సలహా కమిటీ ఏర్పాటు, కాకినాడలో 1 MMTPA గ్రీన్ అమోనియా ప్లాంట్కు స్టాంప్ డ్యూటీ మినహాయింపు, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ చట్టంలో సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos