ఏపీలో ఇటీవల ఎన్నికల పోలింగ్ సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలు మరిచిపోక ముందే... ఇప్పుడు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సందర్భంగా కూడా హింస చెలరేగే అవకాశం ఉందని ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. కౌంటింగ్ రోజు వైసిపి నేతలు ఎంతటి హింసకైనా బరి తెగిస్తారని వారు అంటున్నారు. ఈ క్రమంలో విదేశీ పర్యటన ముగించుకుని నిన్న హైదరాబాద్ చేరుకున్న అధినేత చంద్రబాబు కౌంటింగ్ ప్రక్రియపై దృష్టి పెట్టారు. ఈ మేరకు తన నివాసంలో కలిసిన పార్టీ సీనియర్ నేతలతో గంటన్నరపాటు సమావేశం నిర్వహించడంతో పాటు అంతకుముందు నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లోనూ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరిగిన తీరు, లెక్కింపు రోజు తీసుకోవాల్సిన చర్యలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల వరకు పడ్డ కష్టం ఒక ఎత్తైతే, కౌంటింగ్ రోజు మరో ఎత్తని చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు. వైఎస్సార్సీపీ ముందే ఓటమిని అంగీకరించిందని... ఓటమి భయంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఆ పార్టీ మూకలు కౌంటింగ్ రోజూ అల్లర్లు సృష్టించేందుకు యత్నిస్తున్నారన్న సమాచారం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ముందు రోజు నుంచే పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైఎస్సార్సీపీ 35 సీట్లకే పరిమితమవుతుందనే ప్రచారం ఉందని నేతలు చంద్రబాబు వద్ద ప్రస్తావించగా, పోలింగ్ జరిగిన తీరు చూస్తే ఆ పార్టీకి అన్ని కూడా వచ్చేట్లు లేవని చెప్పారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాల్సిందిగా ఈసీ, డీజీపీకి లేఖలు రాయాలని పార్టీ నేతలకు సూచించారు. మరోవైపు గెలుపోటముల నిర్ణయంలో బ్యాలెట్లు కీలకం కాబట్టి, వీటిని నిరర్థకం చేసేందుకు వైఎస్సార్సీపీ కుట్రలు చేస్తోందని, వీటిని సమర్థంగా తిప్పికొట్టాలని సూచించారు. ప్రతి 500 పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు ఒక టేబుల్ చొప్పున ఏర్పాటు చేయాల్సి ఉన్నా యంత్రాంగం ఆ మేరకు చేయడం లేదని నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. బుధవారం మధ్యాహ్నానికి మొత్తం 1,081 టేబుళ్లు ఏర్పాటు చేయడాల్సి ఉండగా కేవలం 633 మాత్రమే చేశారని చెప్పడంతో దీనిపై సీఈవోను కలవాలని చంద్రబాబు సూచించారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు కేవలం 122 మంది కౌంటింగ్ పరిశీలకుల్నే ఈసీ నియమించడంపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అత్యంత సమస్యాత్మక నియోజకవర్గాలైన మాచర్ల, గురజాలకు కలిపి ఒకే కౌంటింగ్ పరిశీలకుడ్ని నియమించడం ఏంటని ప్రశ్నించారు. ఓట్ల లెక్కింపులో ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా, గెలిచిన అభ్యర్థి ప్రకటనలో కీలకంగా వ్యవహరించే కౌంటింగ్ పరిశీలకుల్ని తక్కువ సంఖ్యలో నియమించడం తగదని చంద్రబాబు హితవు పలికారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos