ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 ఉద్యోగ పరీక్ష తేదీలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్చింది. 2025 జనవరి 5న నిర్వహించాల్సిన పరీక్షను ఫిబ్రవరి 23కు రీషెడ్యూల్ చేశారు. ఇతర వివరాల కోసం కమిషన్ వెబ్సైట్ https://portal-psc.ap.gov.in/ సందర్శించాలని ఏపీపీఎస్సీ ప్రకటించింది.
కాగా గ్రూప్ 2 పరీక్షలకు ప్రిపరేషన్ కోసం సమయం సరిపోవడం లేదని, వాయిదా వేయాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని కొంతకాలంగా కోరుతూ వస్తున్నారు. ఇటీవల ఏపీపీఎస్సీ చైర్మన్ గా రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఏఆర్ అనూరాధ నియమితులయ్యారు. పరీక్షల నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించిన తర్వాత.. అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాల మేరకు ఆమె వాయిదాకు మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే వేపాడ చిరంజీవి రావు కూడా ఏపీపీఎస్సీ చైర్మన్ ను కలిసి ఉద్యోగార్థుల కోరిక మేరకు వాయిదా వేయాలని కోరారు. చివరికి అభ్యర్థులకు నెలన్నర వరకు అదనపు సమయం వచ్చేలా ఫిబ్రవరి 23వ తేదీకి రీ షెడ్యూల్ చేశారు.
ఏపీపీఎస్సీ మొత్తం 899 గ్రూప్-2 పోస్టులను ప్రకటించిన విషయం తెలిసిందే. గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్షను 2024 ఫిబ్రవరి 25న నిర్వహించి.. ఫతాలను ఏప్రిల్ 10న ప్రకటించారు. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు మొత్తం 92,250 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వీరందరూ మెయిన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో అప్పటి వరకూ ఏపీపీఎస్సీ చైర్మన్ గా చేసిన గౌతం సవాంగ్ రాజీనామా చేసి వెళ్లిపోయారు. కొత్త చైర్మన్ ను ఎంపిక చేసిన తర్వాత పరీక్ష జరగాల్సి ఉంది.
గ్రూప్ 2 మెయిన్స్ లో రెండు పేపర్లు ఉంటాయి. మొత్తం 300 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఒక్కొక్క దానికి 150 మార్కులు కేటాయించారు. పేపర్-1లో ఏపీ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం అంశాలు సిలబస్గా ఉన్నాయి. పేపర్-2లో భారతదేశ, ఏపీ ఆర్థిక వ్యవస్థ, సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సెక్షన్ కు 75 మార్కులు ఉంటాయి. మొత్తంమీద అభ్యర్ధులు కోరుకుంటున్నట్లు పరీక్ష వాయిదా పడటంతో... ప్రిపరేషన్ కు చాలా సమయం లభించినట్లయిందని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos