గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో ఫిర్యాదుదారుడిని బెదిరించారన్న ఆరోపణలతో అరెస్టు అయిన వైసీపీ లీడర్ వల్లభనేని వంశీకి మరో షాక్ తగిలింది. అసలు కేసులో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. ఈ కేసులో ఆయన 71వ నిందితుడిగా ఉన్నారు. ప్రస్తుతం వల్లభనేని వంశీ విజయవాడ జైల్లో ఉన్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి విషయంలో ఫిర్యాదు చేసిన సత్యవర్థన్ అనే వ్యక్తిని బెదిరించిన కేసులో అరెస్టు అయ్యారు. సత్యవర్థన్ సోదరుడి ఫిర్యాదుతో ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిన పోలీసులు ఆయన్న వారం రోజుల క్రితం అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ కేసులో కూడా బెయిల్ కోసం వంశీ ప్రయత్నాలు చేస్తున్నారు.
గత వైసీపీ ప్రభుత్వంలో గన్నవరం టీడీపీ ఆఫీసుపై ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీ ప్రోద్భలంతో దాడి జరిగినట్లు పోలీసులు గతంలో కేసు నమోదు చేశారు. టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న దళిత యువకుడు సత్యవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదుపై వంశీతో పాటు మొత్తం 88 మందిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు విచారణ తుది దశకు వచ్చిన తరుణంలో హఠాత్తుగా ఫిర్యాదుదారు సత్యవర్ధన్ యూటర్న్ తీసుకున్నాడు. దీంతో పోలీసులు విచారించగా అసలు విషయం బయటపడింది.
వల్లభనేని వంశీ అనుచరులు కొమ్మాకోట్లు, రాము, ఇతరులు సత్యవర్ధన్ ను బెదిరించడం వల్లే అతను ఫిర్యాదు వెనక్కి తీసుకున్నట్లు గుర్తించారు. సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి హైదరాబాద్ లోని వంశీ ఇంటికి తీసుకెళ్లినట్లు కూడా గుర్తించారు. దీంతో వీరిని అరెస్టులు చేశారు. వంశీని అరెస్టు తర్వాత కోర్టులో హాజరుపర్చి రిమాండ్ పై జైలుకు పంపారు. పోలీసులు అరెస్టు చేయకముందే వంశీ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. బెయిల్ ఇవ్వలేమని తేల్చేసింది. ఈ మేరకు వంశీ బెయిల్ పిటిషన్ ను తోసిపుచ్చింది. ఏదైనా ఉంటే విజయవాడ ఎస్సీఎస్టీ కోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. దీంతో వంశీకి న్యాయస్థానంలో కేసుల పరంగా మరోసారి షాక్ తగిలినట్లు అయింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos