ఏపీలో వైసీపీ మాజీ మంత్రి పేర్నినానికి భారీ షాక్ తగిలింది. మచిలీపట్నంలో రేషన్ బియ్యం మాయం వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పేర్ని నాని భార్య జయసుధకు నిన్న కృష్ణాజిల్లా కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. అంతలోపే పోలీసులు పేర్ని నానిని ఇదే కేసులో ఏ6గా చేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతకు ముందు తన భార్య అరెస్టు కాకుండా అడ్డుకున్న చంద్రబాబుపై పేర్నినాని పొగడ్తలు కురిపించారు. అయినా పేర్నికి రేషన్ బియ్యం కేసులో ఊరట దక్కలేదు.
వైసీపీ హయాంలో పేర్ని నాని మంత్రిగా ఉండగా బందరులో ఆయన భార్య జయసుధ పేరుతో ఉన్న గోడౌన్ లో పౌరసరఫరాలశాఖ అధికారులు రేషన్ బియ్యం నిల్వ చేశారు. అయితే తాజాగా అందులో చాలా వరకూ మాయం అయినట్లు ఆరోపణలు రావడంతో పౌరసరఫరాలశాఖతో పాటు పోలీసు శాఖ కూడా దృష్టిసారించింది. ఇదే క్రమంలో గోడౌన్ ఓనర్ అయిన పేర్ని జయసుధను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం అయినట్లు ప్రచారం కూడా జరిగింది. ఈ కేసులో తన భార్య జయసుధ అరెస్టుకు ఓ మంత్రి తీవ్రంగా ప్రయత్నించినా సీఎం చంద్రబాబు మాత్రం ఒప్పుకోలేదని పేర్ని నాని ప్రశంసించారు. దీంతో చంద్రబాబును పొగిడిన పేర్ని కుటుంబానికి ఈ కేసులో ఊరట దక్కుతుందేమోనని అంతా అనుకున్నారు. కానీ నిన్న ఒక్కరోజే రేషన్ బియ్యం కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారితో పాటు వీరి గోడౌన్ మేనేజర్, రైస్ మిల్లు యజమాని, లారీ డ్రైవర్ ను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్ కు పంపారు. అదే సమయంలో సాయంత్రం కృష్ణాజిల్లా కోర్టు జయసుధకు ముందస్తు బెయిల్ ఇచ్చింది. దీని తర్వాత పేర్నినానిని ఈ కేసులో ఏ6గా చేర్చారు. దీంతో పేర్ని అరెస్టు తప్పదని తెలుస్తోంది.
మరోవైపు రేషన్ బియ్యం మాయం కేసులో ఇప్పటికే నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి మచిలీపట్నంలోని స్పెషల్ మొబైల్ జడ్జి 12 రోజుల రిమాండ్ విధించారు. దీంతో నిందితులను మచిలీపట్నం సబ్జైలుకు తరలించారు. వైసీపీ పాలనలో జయసుధ పేరిట గోదామును పేర్ని నాని నిర్మించారు. దాన్ని పౌరసరఫరాల శాఖకు అద్దెకు ఇచ్చారు. ఇటీవల ఆ గిడ్డంగిని అధికారులు తనిఖీ చేసిన నేపథ్యంలోనే బియ్యం నిల్వల్లో వ్యత్యాసాన్ని గుర్తించారు. పెద్ద ఎత్తున రేషన్ బియ్యం మాయమైనట్లు తేల్చారు. గోదాము మేనేజర్ మానస్తేజ, పౌరసరఫరాల అధికారి కోటిరెడ్డి మిగిలిన ఇద్దరి బ్యాంకు ఖాతాల లావాదేవీల్లో సుమారు రూ.25 లక్షల నుంచి రూ.30లక్షల మేర లావాదేవీలు జరిగాయని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. వీటి ఆధారంగానే మిగిలిన నిందితులను గుర్తించినట్లు సమాచారం. మరోవైపు పేర్ని నాని కుటుంబంలోని పలువురి ఖాతాలకు కూడా మానస్తేజ ఖాతా నుంచి డబ్బు (రూ.లక్షల్లో)లావాదేవీలు జరిగాయని ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos