ఏపీ రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్ధితి గత కొన్నేళ్లుగా నెలకొంది. కేంద్రంలో బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఏపీలో ఆ పార్టీ మిత్రపక్షంగా ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని నడుపుతోంది. అయితే రాష్ట్రంలోజగన్ ను టీడీపీ ఎంతో బద్ధ శత్రువుగా పరిగణిస్తున్నా ...కేంద్రంలో ఆ పార్టీ మిత్రపక్షమైన బీజేపీ మాత్రం అలా అనుకోవడం లేదు. అలాగే జగన్ కూడా బీజేపీని శత్రువుగా భావించట్లేదు. ఈ రెండు అంశాలకు నిదర్శనంగా రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్ధి సీపీ రాధాకృష్ణన్ కు ఓటేయాలని కోరుతూ ఇటీవల కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ జగన్ కు ఫోన్ చేసి అడిగారు. దీంతో జగన్ కూడ ఎప్పటిలాగే సరేనన్నారు. తనను జైలుకు పంపిన కాంగ్రెస్ తో ఇప్పటికీ శత్రుత్వం కొనసాగిస్తున్న జగన్.. సహజంగానే బీజేపీకి ఈ విషయంలో అండగా నిలిచారు. అదే సమయంలో జగన్ కూ పలు విధాలుగా బీజేపీ సహకరిస్తూనే ఉంది. ఇందులో జగన్ అక్రమాస్తుల కేసులతో పాటు వివేకా కేసు కూడా ఉంది. ఇదే వివేకా కేసులో నిందితుడిగా ఉన్న, ప్రధాన కుట్రదారుగా సీబీఐ భావిస్తున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తాజాగా ఆయన పుట్టినరోజు సందర్భంగా బీజేపీ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోని కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు, మీరు చిరకాలం ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నట్లు గడ్కరీ ఎక్స్ లో పోస్ట్ చేసిన ట్వీట్ లో పేర్కొన్నారు.
వాస్తవానికి గడ్కరీ పెట్టిన ట్వీట్ కు పెద్దగా ప్రాధాన్యం ఉండకపోవచ్చు. కానీ ప్రస్తుతం ఏపీలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఈ ట్వీట్ కు ప్రాధాన్యం ఏర్పడింది. ఓవైపు అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కోసం సీబీఐ సుప్రీంకోర్టులో పోరాటాలు చేస్తోంది. ఇందులో సీరియస్ నెస్ లేదని మరోవైపు వివేకా కుమార్తె సునీతారెడ్డి ఆరోపిస్తున్నారు. ఇలాంటి సమయంలో అవినాష్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ గడ్కరీ పెట్టిన ట్వీట్ చూస్తే ఆయనకు కేంద్రంలో ఉన్న పెద్దల ఆశీస్సులు మెండుగానే ఉన్నాయా అని రాజకీయ విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. లేకపోతే గడ్కరీ వంటి బిజీ కేంద్రమంత్రి కేవలం ఏపీలో ఓ విపక్ష ఎంపీకి ఇలా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాల్సిన అవసరం లేదని వారు అంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos