ఏపీలో రాజకీయాలు కొత్త మలుపు తీసుకుంటున్నాయి. కూటమి పార్టీలు సొంతంగా బలం పెంచు కోవటం పైన ఫోకస్ చేస్తున్నాయి. ఏడాది పాలన పైన టీడీపీ నేతలు తొలి అడుగు పేరుతో ప్రజల్లోకి వెళ్లారు. జగన్ లక్ష్యంగా టీడీపీ వ్యూహాలు అమలు చేస్తోంది. జగన్ కౌంటర్ గా కార్యాచరణ అమలు చేస్తున్నారు. ఇదే సమయంలో బీజేపీ నేతలు ఏపీ కేంద్రంగా తీసుకుంటున్న నిర్ణయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కొత్తగా చేసిన నియామకాలతో పాటుగా తాజాగా చేస్తున్న డిమాండ్ల పైన కూటమిలో చర్చ మొదలైంది.
కూటమిలో బీజేపీ పట్టు బిగిస్తోంది. ఢిల్లీ నేతల లక్ష్యాలకు అనుగుణంగా నిర్ణయాలు జరుగుతున్నాయి. కూటమి నుంచి ఇప్పటికే బీజేపీకి రెండు రాజ్యసభ స్థానాలు దక్కాయి. ఒక ఎమ్మెల్సీ సీటును సొంతం చేసుకుంది. ఈ మూడు నియామకాల విషయంలో బీజేపీ ఎంపిక చేసిన అభ్యర్ధుల విషయంలో టీడీపీ మద్దతుదారుల్లో భిన్నమైన చర్చ జరిగింది. కాగా, బీజేపీ ఏపీ చీఫ్ గా పని చేసిన పురందేశ్వరిని తప్పించారు. ఆ స్థానంలో సుదీర్ఘ కాలంగా బీజేపీలో పనిచేస్తున్న మాధవ్ కు అవకాశం కల్పించారు. ఈ నియామకం వెనుక పెద్ద వ్యూహమే ఉంది. ఏపీ నుంచి కేంద్ర మంత్రి గా ఉన్న శ్రీనివాసవర్మ, రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేసిన పాక సత్యనారాయణ, ఇప్పుడు మాధవ్ ఎంపిక ద్వారా పార్టీలో సుదీర్ఘకాలం పని చేసిన వారే. దీని ద్వారా గతం కంటే భిన్నంగా బీజేపీ తమ నిర్ణయాలు ఏంటో స్పష్టత ఇచ్చింది.
ఏపీలో ఎంతో కాలంగా బీజేపీ రాజకీయంగా ఎదగాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు అవకాశం సద్వినియోగం చేసుకోవాలని డిసైడ్ అయింది. ఏపీకి అమిత్ షా వచ్చిన సమయంలో పార్టీ నేతలకు ఇదే అంశాన్ని స్పష్టం చేసారు. కూటమిలో.. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నా.. పార్టీ సొంతం గా బలం పెంచుకోవటం పైనే నేతలంతా నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేసారు. ఇక, బనకచర్ల విషయంలోనూ కేంద్రం తీసుకున్న నిర్ణయం పైన చర్చ జరుగుతోంది. కేంద్రానికి స్పష్టత ఇచ్చి ఈ ప్రాజెక్టు విషయంలో అనుమతులు సాధించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అనూహ్యంగా ఇదే సమయంలో బీజేపీ ఏపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అసలు బీజేపీ లేకపోతే.. ప్రభుత్వం ఈ స్థాయిలో విజయం సాధించేదా అంటూ ప్రశ్నించారు.
అదే సమయంలో కూటమిలో తమ పార్టీకి కేటాయిస్తున్న 5 శాతం వాటాపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండటం, రాష్ట్రంలో బీజేపీ మద్దతు కూటమి విజయానికి కీలకమని ఆయన పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 5 శాతానికి మించి సీట్లు కావాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఈ సారి బీజేపీ సీరియస్ గా తీసుకుంటోంది. స్థానిక సంస్థల్లో కూటమి పార్టీగా ఎక్కువ సీట్లు సాధించి గెలవాలనే లక్ష్యంతో ఉంది. అందులో భాగంగానే ఈ వ్యాఖ్యలు పార్టీ నేతలు చేస్తున్నట్లు స్పష్టం అవుతోంది. అదే విధంగా.. ఏపీలో పరిణామాలు.. పార్టీకి ప్రాధాన్యత పైన కేంద్ర నాయకత్వం ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తోంది. దీంతో, రానున్న రోజుల్లో బీజేపీ ఏపీ కేంద్రంగా మరిన్ని ఆసక్తికర నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos