ప్రతి ఏటా ఫిబ్రవరి 1వ తేదీ రాగానే దేశంలోని కోట్లాది మంది సామాన్యులు, మధ్యతరగతి వేతన జీవులు ఆశగా ఎదురుచూసేది కేంద్ర బడ్జెట్ వైపే. పెరిగిన ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరల మధ్య నలిగిపోతున్న సామాన్యుడికి 2026 బడ్జెట్ ఎంతవరకు ఊరటనిస్తుంది.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బుట్టలో మధ్యతరగతి కోసం ఎలాంటి వరాలు ఉంచారనే అంశాలపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. వేతన జీవుల ప్రధాన డిమాండ్ ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితులను పెంచడం. ప్రస్తుతం పాత పన్ను విధానంలో (Old Tax Regime) ప్రాథమిక మినహాయింపు పరిమితిని ₹2.5 లక్షల నుండి ₹5 లక్షలకు పెంచాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల పొదుపు పథకాలపై ఆధారపడే వారికి ఊరట లభిస్తుంది. ఇక కొత్త పన్ను విధానంలో (New Tax Regime) ఇప్పటికే ₹12 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి రిబేటుల ద్వారా పన్ను లేకుండా వెసులుబాటు కల్పించగా, ఈసారి ఆ పరిమితిని ₹15 లక్షలకు పెంచే అవకాశం ఉందని అంచనా. అలాగే, 30% గరిష్ట పన్ను విధించే పరిధిని ప్రస్తుతం ఉన్న ₹24 లక్షల నుండి ₹30 లక్షలకు పెంచడం ద్వారా ఎగువ మధ్యతరగతి వర్గాల చేతిలో నగదు మిగిలి, మార్కెట్లో వినియోగం పెరిగే అవకాశం ఉంది. దీనికి తోడు, అందరికీ వర్తించే స్టాండర్డ్ డిడక్షన్ (Standard Deduction) మొత్తాన్ని ₹75,000 నుండి ₹1 లక్షకు పెంచాలనే ప్రతిపాదనను ప్రభుత్వం సీరియస్గా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
సామాన్యుడి వంటగదిపై భారం తగ్గించడమే ఈ బడ్జెట్ ప్రధాన లక్ష్యం కావచ్చని ఆర్థిక నిపుణులు అంటున్నారు. వంటగ్యాస్ (LPG) సబ్సిడీలను మరింత మందికి వర్తింపజేయడం, పెట్రోల్ మరియు డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం వంటి సాహసోపేత నిర్ణయాల కోసం జనం ఎదురుచూస్తున్నారు. జీఎస్టీ (GST) కౌన్సిల్ ద్వారా నిత్యావసర వస్తువులైన పాలు, పప్పు దినుసులు, వంట నూనెలపై పన్ను రేట్లను క్రమబద్ధీకరించడం ద్వారా ధరలను అదుపులోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహిస్తూనే, మధ్యతరగతి వారికి సొంత ఇంటిని అందుబాటులోకి తీసుకురావడానికి సెక్షన్ 24(b) కింద గృహ రుణ వడ్డీ మినహాయింపును ₹2 లక్షల నుండి ₹3 లక్షలకు పెంచే అవకాశం ఉంది. 'అందరికీ ఇల్లు' పథకంలో భాగంగా మధ్యతరగతి ప్రజలకు వడ్డీ రాయితీ పథకాన్ని మళ్ళీ ప్రవేశపెట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ప్రైవేట్ ఆసుపత్రుల ఖర్చులు భారంగా మారిన నేపథ్యంలో, ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పరిమితిని ₹5 లక్షల నుండి ₹10 లక్షలకు పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీనివల్ల కోట్లాది కుటుంబాలకు భరోసా లభిస్తుంది. అలాగే, ఎడ్యుకేషన్ లోన్లపై వడ్డీ రేట్లను తగ్గించడం, స్కాలర్షిప్ల కేటాయింపులను పెంచడం ద్వారా విద్యార్థులకు మేలు చేకూరనుంది. సీనియర్ సిటిజన్లకు ఇచ్చే పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను స్థిరీకరించడం కూడా ఈ బడ్జెట్లో ఆశించదగ్గ అంశాలని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos