ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్ల సరిహద్దుల మార్పులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సమీక్ష జరిగిన విషయం తెలిసిందే. ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె కేంద్రాలుగా కొత్త జిల్లాల ఏర్పాటుకు సీఎం ఆమోదం తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంతో రంపచోడవరం కేంద్రంగా మరో జిల్లా ఏర్పాటు అంశం తాజాగా తెరమీదకు వచ్చింది. పరిమిత స్థాయిలోనే మార్పులు, చేర్పులు ఉండాలని ఆయన స్పష్టం చేశారు.

కాగా రంపచోడవరం, చింతూరు డివిజన్‌లను తూర్పుగోదావరి జిల్లాలో కలిపితే అది పెద్ద జిల్లాగా మారుతుందని భావిస్తున్నారు. ఈ రెండు డివిజన్‌లు ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నాయి. చింతూరు నుంచి జిల్లా కేంద్రమైన పాడేరుకు 215 కి.మీ. దూరం ఉండటంతో ఈ మార్పును పరిశీలిస్తున్నారు. ఒకవేళ ఈ డివిజన్‌లను తూర్పు గోదావరి జిల్లాలో చేర్చితే ఆ జిల్లా జనాభా 24.48 లక్షలకు చేరుతుంది. అందువల్ల రంపచోడవరం, చింతూరు డివిజన్లను కలపకుండా కొత్త జిల్లా ఏర్పాటు చేయడమే మంచిదని మంత్రివర్గ ఉప సంఘానికి సీఎం సూచనలు చేశారు. జిల్లాల సరిహద్దుల మార్పు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై మరికొన్ని సూచనలు సీఎం చేశారు. సీఎం సూచనలకు అనుగుణంగా మరో నివేదికతో మంత్రివర్గ ఉప సంఘం రూపొందించనుంది. దానిపై సీఎం అధ్యక్షతన నేడు మంగళవారం మరోమారు సమావేశమై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

మరోవైపు కొత్తగా అద్దంకి, మడకశిర రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సానుకూలత వ్యక్తం చేసే అవకాశం కనిపిస్తోంది. బనగానపల్లె రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై ప్రతిపాదనను ప్రస్తుతానికి వాయిదా వేశారు. గూడూరు డివిజన్ ను తిరుపతి నుంచి నెల్లూరు జిల్లాలో కలిపే ప్రతిపాదనను ముందుకు తెచ్చే అవకాశం ఉందంటున్నారు. నగరి డివిజన్ ను చిత్తూరు నుంచి తిరుపతి జిల్లాకు మార్చాలనే ప్రతిపాదన కూడా ప్రస్తుతం చర్చకు రానుంది.

ఇక పెనమలూరు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో చేర్చకపోవడంపై సీఎం చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. విజయవాడ నగరంలో భాగంగా ఉన్న పెనమలూరును విస్మరించి, దూరంగా ఉన్న గన్నవరం, నూజివీడు నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలో కలపడంపై ఆయన ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులు చెబితేనే చేరుస్తారా..  భౌగోళిక పరిస్థితులు చూడాల్సిన బాధ్యత లేదా..  అలాంటప్పుడు మంత్రివర్గ ఉపసంఘం ఎందుకని సీఎం నిలదీశారు. ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో మార్పులపై తర్వాత చర్చించాలని ఆయన సూచించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Take Oath As A TDP National Working President | CM Chandrababu | AG

తాజా వార్తలు

Related Videos