ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమిపై బీజేపీ పట్టు బిగిస్తోంది. భాగస్వామ్య పార్టీగా ఉంటూనే బలం పెంచుకోవటంపై వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఒక రాజ్యసభ.. ఒక ఎమ్మెల్సీ సీటు దక్కించుకున్న బీజేపీ.. ఇప్పుడు మరో రాజ్యసభ స్థానం పైన కన్నేసింది. వైసీపీలో కీలకంగా వ్యవహరించిన విజయ సాయిరెడ్డి రాజీనామాతో ఏపీ నుంచి రాజ్యసభ స్థానం ఖాళీ అయింది. ఈ సీటు కోసం టీడీపీ - బీజేపీ నుంచి ఆశావహులు రేసులో ఉన్నారు. కాగా, ఈ సీటు ఎవరికి దక్కుతుందనేది దాదాపు స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి సాయిరెడ్డి ఖాళీ చేసిన స్థానం బీజేపీకి దక్కనుంది. ఈ విషయంపై ఇప్పటికే ఢిల్లీ బీజేపీ నాయకత్వం చంద్రబాబు, పవన్ కు స్పష్టం చేసి నట్లు సమాచారం.
సాయిరెడ్డి స్థానం రాయలసీమకు చెందిన రెడ్డి వర్గానికి కేటాయించాలని తొలుత భావించారు. ఈ క్రమంలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరు తెర మీదకు వచ్చింది. ఇప్పుడు అనూహ్యంగా బీజేపీ అధి నాయకత్వం మరో పేరు వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ వాయిస్ జాతీయస్థాయి లో బలంగా వినిపించే జీవీఎల్ నరసింహారావు పేరు ఫైనల్ అవుతుందని ప్రచారం సాగుతోంది. జీవీఎల్ నరసింహారావు గతంలో యూపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. 2024 ఎన్నికల్లో కూటమి అభ్యర్దిగా విశాఖ నుంచి పోటీ చేసేందుకు చివరి వరకు ప్రయత్నించారు. కాగా, టీడీపీ విశాఖ సీటు ఇవ్వటానికి నిరాకరించింది. ఫలితంగా అనకాపల్లి సీటు దక్కగా.. అక్కడ నుంచి సీఎం రమేశ్ పోటీ చేసి గెలుపొందారు.
ఇప్పుడు జీవీఎల్ కు రాజ్యసభ సీటు ఇవ్వాలని పార్టీ అధి నాయకత్వం భావిస్తున్నట్లు ఢిల్లీ బీజేపీ ముఖ్య నేతల సమాచారం. కిరణ్ కుమార్ రెడ్డి ఈ పదవి కోసం ఇప్పటికే సీఎం చంద్రబాబుతో పాటుగా బీజేపీ ముఖ్య నేతలతోనూ సంప్రదింపులు చేసారు. కాగా, ఈ సీటు బీజేపీకే వెళ్లుందని టీడీపీ నేతలు సైతం చెబుతున్నారు. ఇక.. జీవీఎల్ తో పాటుగా మరో ఇద్దరు నేతలు సైతం రాజ్యసభ కోసం పోటీ పడుతున్నారు. దీంతో.. చివరి నిమిషంలో అనూహ్య మార్పులు జరిగితే తప్ప .. ఈ సీటు బీజేపీకి దక్కటం ఖాయంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos