కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్క రైతూ సంతోషంగా లేడని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. బుధవారం గుంటూరులోని మిర్చి యార్డు రైతులను జగన్ కలిసి .. వారి కష్టనష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ …. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు చాలా కష్టాలు పడుతున్నారని, ఏ ఒక్క రైతూ సంతోషంగా లేడని చెప్పారు. ఏ పంటకూ గిట్టుబాటు లేకుండా పోయిందని, దీంతో రైతులు బతికే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని విమర్శించారు. తమ హయాంలో.. రైతులు నష్టపోకుండా గిట్టుబాటు ధర కల్పించామని జగన్ అన్నారు. రూ.21 వేల నుంచి రూ. 27 వేల వరకు వచ్చేదని చెప్పారు. పెట్టుబడి సాయం చేసి రైతులకు అండగా నిలిచామన్నారు. వైసీపీ హయాంలో రైతే రాజు కానీ, కూటమి ప్రభుత్వం రైతును దగా చేసిందని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వం పెట్టుబడి సాయం ఇవ్వలేదనీ, రైతులకు సున్నా వడ్డీ రాని పరిస్థితి నెలకొందని అన్నారు. మిర్చి రైతుల అవస్థలను చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోవడం లేదని జగన్ ధ్వజమెత్తారు. రైతులు పండించిన పంటను కూడా అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. మిర్చి పంటకు కనీసం రూ.11 వేలు కూడా గిట్టుబాటు ధర లేదని, ఆర్బీకే వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, ఈ ఏడాది దిగుబడి కూడా బాగా తగ్గిపోయిందన్నారు. రైతులను దళారీలకు అమ్మేసే పరిస్థితి కనిపిస్తోందని, ఎరువులను బ్లాక్లో కొనాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరవాలని జగన్ అన్నారు. రాబోయే రోజుల్లో రైతులకు అండగా వైసీపీ ఉద్యమిస్తుందని వైఎస్ జగన్ అన్నారు.అమరావతి లో ఉన్న చంద్రబాబుకు సమీపంలోనే గుంటూరు మిర్చి యార్డులో కష్టాల్లో ఉన్న రైతులను పరామర్శించటానికి సమయం దొరకలేదా అని ధ్వజమెత్తారు. సచివాలయానికి - మిర్చి యార్డుకు ఎంత దూరం ఉందని.. పరామర్శకు రాలేదని నిలదీసారు. తిరిగి వైసీపీ ప్రభుత్వం వస్తుందని జగన్ ధీమా వ్యక్తం చేసారు. రైతుల సమస్యల పై స్పందించక పోతే ఉద్యమం తప్పదని జగన్ తేల్చి చెప్పారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos