వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కేసులు చుట్టుముడుతున్నాయి. ఆయనపై తాజాగా మరో కేసు నమోదైంది. మూడు రోజుల వ్యవధిలో జగన్ పై నమోదైన రెండో కేసు ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాజకీయంగా దుమారం రేపుతోంది. జగన్ జనంలోకి వెళ్లకుండా కూటమి ప్రభుత్వం.. అడ్డుకుంటోందంటోన్న వైఎస్ఆర్సీపీ నాయకుల ఆరోపణలకు అనుగుణంగా కేసులు నమోదవుతుండటం చర్చనీయాంశమవుతోంది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో గుంటూరు మిర్చియార్డులో జగన్ పర్యటించిన విషయం తెలిసిందే. మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ఆయన ఈ పర్యటన చేపట్టారు. మిర్చి రైతులను పరామర్శించారు. గిట్టుబాటు ధర కల్పించాలంటూ డిమాండ్ చేశారు. ఆ ఘటనకు సంబంధించి పోలీసులు తాజాగా జగన్ పై కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు వైఎస్ఆర్సీపీకి చెందిన పలువురిపై కేసు నమోదు చేశారు. మరికొందరు సీనియర్ నాయకులకు పోలీసులు 41ఏ నోటీసులు ఇచ్చారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు, శాసన మండలి సభ్యుడు లేళ్ల అప్పిరెడ్డి, లోక్ సభ మాజీ సభ్యుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు.
విచారణ కోసం నల్లపాడు పోలీస్ స్టేషన్ కు రావాల్సి ఉంటుందని ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. వైఎస్ జగన్ గుంటూరు మిర్చియార్డును సందర్శించిన సమయంలో శాసన మండలి ఎన్నికల ప్రవర్తన నియమావళి, కోడ్ అమలులో ఉందని, దాన్ని ఉల్లంఘించి జగన్ ఈ పర్యటన చేపట్టారని తెలుస్తోంది. ప్రభుత్వ ఆధీనంలో ఉండే మిర్చియార్డులో జగన్ రాజకీయ ప్రసంగం చేయడం నిబంధనలకు విరుద్ధమని పోలీసులు చెబుతున్నారు. ఇటీవలే పల్నాడు జిల్లా పర్యటన సందర్భంగా ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఆయన కారు కింద పడి సింగయ్య అనే వ్యక్తి మరణించిన ఘటనలో జగన్ పై బీఎన్ఎస్ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు పెట్టారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos