ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో గత ప్రభుత్వ హయాంలో భారీ కుంభకోణం జరిగిందని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లినా, ఇందులో సీబీఐ ఎక్కడా క్లీన్ చిట్ ఇవ్వలేదని ఆయన గుర్తుచేశారు. నెయ్యి పేరుతో పామాయిల్, ప్రమాదకరమైన రసాయనాలు వాడి భక్తుల మనోభావాలను, ఆరోగ్యాన్ని దెబ్బతీశారని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈ వ్యవహారంపై మాట్లాడేటప్పుడు తాము అన్ని పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, ఈ అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకురావడం తన బాధ్యత అని స్పష్టం చేశారు. ఇవాళ గురువారం ఉండవల్లిలో కూటమి నేతల సమావేశం అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్ లో పవన్ మాట్లాడారు.
పవన్ కల్యాణ్ తన ఆరోపణలకు సంబంధించిన గణాంకాలను కూడా మీడియా ముందుంచారు. "తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) ఓ నిర్దిష్ట కంపెనీ 59.70 లక్షల కిలోల నెయ్యి సరఫరా చేసినట్లు అధికారికంగా లెక్కలు చూపింది. కానీ, మా వద్ద ఉన్న ఆధారాల ప్రకారం, అదే కంపెనీ 58 లక్షల కిలోలకు పైగా పామాయిల్, దానికి సంబంధించిన ప్లాంట్ బేస్డ్ ఉత్పత్తులను కొనుగోలు చేసింది. అంతేకాకుండా, సుమారు 1.70 లక్షల నుంచి 2 లక్షల కిలోల వరకు రసాయనాలను కూడా కొనుగోలు చేసినట్లు ఆన్ రికార్డ్ ఆధారాలున్నాయి. నెయ్యి సరఫరా చేస్తున్నామని చెప్పి, పామాయిల్, రసాయనాలు కొనుగోలు చేయడం వెనుక ఉన్న మతలబు ఏంటి? ఇది కల్తీ నెయ్యి కాదు, కల్తీ వనస్పతి, కల్తీ పామాయిల్" అని పవన్ వివరించారు. ఈ కుంభకోణం కేవలం తిరుమలతోనే ఆగిపోలేదని, అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి కూడా ఇక్కడి నుంచి పంపిన లక్ష లడ్డూలు సైతం ఈ కల్తీ నెయ్యితో తయారు చేసినవేనని పవన్ ఆరోపించారు. దేశమంతా ఎంతో పవిత్రంగా జరుపుకున్న కార్యక్రమానికి సైతం కల్తీ లడ్డూలు పంపి హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచారని ఆయన మండిపడ్డారు.
గత ప్రభుత్వానికి దేవుడిపై, హిందూ సంప్రదాయాలపై పగ ఉందని, అందుకే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని పవన్ తీవ్రస్థాయిలో విమర్శించారు. "వీరికి ఏడుకొండల స్వామిపై ఎందుకో పగ. ఏడు కొండలు ఎందుకు, రెండు చాలు అన్న చరిత్ర వీరిది. వీరు వ్యక్తులపై, ప్రత్యర్థులపై కాదు, ఏకంగా భగవంతుడిపైనే పగబట్టారు. ఈ కుట్ర వెనుక ఉన్న వారి వారసత్వం, వారి పరంపర ఎలాంటిదో ప్రజలు గమనించాలి. అందుకే ఈ అంశాన్ని సరిదిద్ది, వాస్తవాలను బయటపెట్టాల్సిన అవసరం ఉంది" అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ అక్రమాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన పరోక్షంగా హెచ్చరించారు. పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos