ఏపీ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల ఖరారు వేళ చాగంటి కోటేశ్వర రావుకు కేబినెట్ హోదాలో కీలక బాధ్యతలు అప్పగించింది. జగన్ హయాంలోనూ చాగంటికి పదవి కేటాయించినా.. ఆ టైం లో ఆయన స్వీకరణకు ముందుకు రాలేదు. కానీ, కొద్ది రోజుల క్రితం చంద్రబాబు, లోకేష్ తో చాగంటి సుదీర్ఘ భేటీ జరిగింది. తాను ప్రభుత్వం కేటాయించిన బాధ్యతల స్వీకరణకు సిద్దంగా ఉన్నట్లు చాగంటి వెల్లడించారు.
విద్యార్ధులను మంచి మార్గంలో నడిపంచేలా నైతిక విలువలను బోధించే లా తన వంతు ప్రయత్నం చేస్తానని చాగంటి చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో తాజాగా మంత్రివర్గ భేటీలో జరిగిన చర్చ మేరకు చాగంటికి ప్రభుత్వం మరో కీలక బాధ్యత కేటాయించింది. ప్రభుత్వ సలహాదారు హోదా లో ఉన్న చాగంటి కోటేశ్వరరావుతో ప్రత్యేకంగా పుస్తకాలు తయారు చేయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో విద్యాశాఖ పైన చర్చ వేళ ఈ ప్రతిపాదన వచ్చింది. దీంతో, ప్రభుత్వం చాగంటితో పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు ఈ పుస్తకాలను రూపొందించి పంపిణీ చేయాలని డిసైడ్ అయింది. ఈ మేరకు మంత్రివర్గ భేటీలోనే నిర్ణయం తీసుకున్నారు.
ఇదే సమయంలో కేజీ నుంచి పీజీ దాకా స్టూడెంట్స్కు విలువలతో కూడిన పాఠ్యప్రణాళిక తయారు చేయాలనే మరో నిర్ణయానికి ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. సర్కారు బడుల్లో చదివే వారికి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర స్కీమ్ కింద అందించే కిట్లలో భాగంగా ఈ పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. చాగంటి కి ప్రభుత్వం మరో కొత్త బాధ్యత అప్పగించనుండటంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos