హైదరాబాద్కు చెందిన ప్రముఖ పాస్టర్ పగడాల ప్రవీణ్కుమార్ మరణం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. . తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం శివారు కొంతమూరు దగ్గర రోడ్డు ప్రమాదంలో ఆయన చనిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఆయన్ను హత్య చేశారని తోటి పాస్టర్లు, క్రైస్తవ సంఘాల ప్రతినిధులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రి దగ్గర వారంతా ఆందోళనకు దిగారు. పాస్టర్ ప్రవీణ్ ఎపిసోడ్పై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్పందించారు. ప్రవీణ్ మరణంపై విచారం వ్యక్తం చేశారు. చంద్రబాబు డీజీపీతో మాట్లాడారు.. పాస్టర్ మృతిపై అన్ని కోణాల్లో విచారణ జరపాలని ఆదేశించారు.
మరోవైపు మంత్రి నారా లోకేష్ కూడా పాస్టర్ ప్రవీణ్ మరణంపై స్పందించారు. 'పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి హఠాన్మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో రోడ్డు ప్రమాదంగా గుర్తించారు. వివిధ సంఘాలు పాస్టర్ గారి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, పూర్తిస్థాయి దర్యాప్తు చేయిస్తామని" అన్నారు మంత్రి నారా లోకేష్. ఇటు హోంమంత్రి వంగలపూడి అనిత పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మృతి ఆరోపణలపై స్పందించారు. తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్కు ఫోన్ చేసి ఆరా తీశారు. పాస్టర్ ప్రవీణ్ మరణంపై సమగ్ర విచారణ చేయాలని ఆదేశించారు.
హైదరాబాద్కు చెందిన పాస్టర్ పగడాల ప్రవీణ్కుమార్కు గోదావరి జిల్లాల్లో చాలామంది ఫాలోవర్లు ఉన్నారు. ఆయన హైదరాబాద్ నుంచి బుల్లెట్పై ఏపీకి వెళ్తుంటారు. సోమవారం ఇలాగే హైదరాబాద్ నుంచి రాజమండ్రికి బుల్లెట్పై బయలుదేరారు. అయితే, అర్ధరాత్రి సమయంలో రాజమండ్రి శివారు కొంతమూరు వద్ద ప్రవీణ్ ప్రమాదానికి గురయ్యారు. రోడ్డు పైనుంచి బుల్లెట్ బైక్తో ప్రవీణ్ కిందికి జారిపోయినట్టుగా ప్రమాదం చూస్తే అర్థమవుతోంది. బైక్ ఆయనపై పడిపోవడంతో బలమైన గాయాలయ్యాయని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదం అర్ధరాత్రి జరిగితే.. మంగళవారం ఉదయం 9 గంటల వరకు ఎవరూ గమనించలేదు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించి.. పాస్టర్ ప్రవీణ్ మృతదేహాన్ని రాజమండ్రి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కు తరలించారు.
పాస్టర్ ప్రవీణ్ పగడాల రోడ్డు ప్రమాదంలో మృతి చెందలేదని.. ఆయన్ని హత్య చేశారని ఆయన ఫాలోవర్స్ అంటున్నారు. క్రైస్తవ సంఘాలు సైతం.. ప్రవీణ్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. మాజీ ఎంపీ హర్షకుమార్, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సైతం ప్రవీణ్ మృతిపై అనుమానాలు ఉన్నాయని .. దర్యాప్తు చేసి నిజానిజాలు తేల్చాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే, ప్రవీణ్ పగడాల ప్రమాదానికి గురైన ప్రాంతానికి సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రోడ్డు పక్కకు జారిపోయిన బుల్లెట్ బైక్తో పాటు అక్కడ విరిగిన కొన్ని కర్రలు కనిపిస్తున్నాయి. వాటితోనే ప్రవీణ్పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారని ఆయన ఫాలోవర్లు ఆరోపిస్తున్నారు.
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతుండటంతో దీనిపై విచారణకు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి.నరసింహకిషోర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇతరుల మనోభవాలు దెబ్బతినేలా.. కుల, మత రాజకీయవర్గాల మధ్య విద్వేషాలు రగిల్చేలా.. మతపరమైన, సున్నిత అంశాల్లో వదంతులు, అవాస్తవాలు ప్రచారం చేస్తూ శాంతిభద్రతలకు భంగం కలిగించినా.. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలను వ్యాప్తి చేసి ప్రజలను రెచ్చగొట్టినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos