ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఆశా వర్కర్లకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్దమవుతోంది. ముఖ్యంగా ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీల అమల్లో భాగంగా ఆశా వర్కర్లకు కూడా పలు ప్రయోజనాలు కల్పించేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా వారికి మొదటి రెండు ప్రసవాలకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవు మంజూరు చేయబోతున్నారు. అలాగే ఆశా కార్యకర్తల గరిష్ట వయోపరిమితిని అంగన్వాడీ కార్యకర్తలతో సమానంగా 62 సంవత్సరాలకు పెంచనున్నట్లు తెలుస్తోంది. అలాగే వారికి గ్రాట్యుటీ ప్రయోజనాలు కూడా కల్పించబోతున్నారు. ఈ మేరకు అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 42752 మంది ఆశా వర్కర్లు ఉన్నారు. వీరిలో గ్రామీణ ప్రాంతాల్లో 37,017 మంది, పట్టణ ప్రాంతాల్లో 5,735 మంది ఉన్నారు. ఆశా వర్కర్లకు ఒక్కొక్కరికీ ప్రస్తుతం 10 వేల వరకూ జీతం లభిస్తుండగా.. ఇతర ప్రయోజనాల కోసం వారు ఎప్పటి నుంచో పోరాటాలు చేస్తున్నారు. దీంతో కూటమి సర్కార్ వారికి గ్రాట్యుటీ, ప్రసూతి సెలవులతో పాటు సర్వీస్ ను 62 ఏళ్లకు పొడిగించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుత లెక్కల్ని బట్టి చూస్తే ఆశా వర్కర్లకు సర్వీస్ ముగిసి రిటైర్ అయ్యే నాటికి లక్షన్నర గ్యాట్యుటీ లభించనున్నట్లు తెలుస్తోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos