జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన రాష్ట్రానికి చెందిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రకటించారు. ఈ ఘటనలో విశాఖపట్నానికి చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి జేఎస్ చంద్రమౌళి, కావలి ఐటి ప్రొఫెషనల్ మధుసూదన్ ఉన్నారు. బుధవారం రాత్రి విశాఖపట్నం విమానాశ్రయంలో చంద్రమౌళి భౌతికకాయాన్ని స్వీకరించారు చంద్రబాబు. అనంతరం నివాళి అర్పించి, మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, హోం మంత్రి వంగలపూడి అనిత, లోక్సభ సభ్యుడు శ్రీభరత్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్తో కలిసి అంతిమయాత్రలో పాల్గొన్నారు. అనంతరం చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. ఈ కష్ట సమయంలో మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రకటించారు. పహల్గామ్ ఉగ్రదాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. సమాజంలో ఇలాంటి దాడులకు తావు లేదని అన్నారు.
జమ్మూ కాశ్మీర్లో శాంతియుతంగా ఎన్నికలు జరగడం, అక్కడ పెరుగుతున్న ఉపాధి అవకాశాలు చూసి ఉగ్రవాదులు ఇలాంటి దాడులకు తెగించారని పేర్కొన్నారు. దేశ రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న ప్రయత్నాలకు ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. దేశాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నించే వారు ఎవరైనా సరే.. కఠినమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని చంద్రబాబు హెచ్చరించారు. ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం ఇవ్వాలని, ప్రతి ఒక్కరూ తమ చుట్టుపక్కల జరిగే అసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఉంచాలని సీఎం చంద్రబాబు కోరారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos