అమరావతి కేంద్రంగా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతులు కొద్ది రోజులుగా తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో.. సీఎం నియమించిన ముగ్గురు సభ్యుల కమిటీ సమావేశమై..కీలక నిర్ణయాలు వెల్లడించింది. కాగా.. ఇప్పడు చంద్రబాబు నేరుగా రైతులతో సమావేశం కావాలని నిర్ణయించారు. వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారం దిశగా హామీ ఇవ్వనున్నారు. 2024లో అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు తొలిసారి నిర్వహిస్తున్న ఈ భేటీ పైన ఆసక్తి నెలకొంది.
అమరావతి రైతులతో ఇవాళ సాయంత్రం చంద్రబాబు సమావేశం కానున్నారు. రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఇప్పటికే చంద్రబాబు సూచించారు. అయితే ముఖ్యమంత్రి తానే స్వయంగా రైతులతో సమావేశం కావాలని డిసైడ్ అయ్యారు. అపరిష్కృతంగా ఏమైనా అంశాలు ఉంటే వాటిని కేబినెట్ ముందు ఉంచాలని సీఎం నిర్ణయించారని తెలుస్తోంది. ఇవాళ అమరావతి రైతుల సమావేశంలో.. జరీబు భూముల సమస్యల విషయంలో నిజమైన జరీబు రైతులకు న్యాయం చేయాలనే డిమాండ్ పైన చంద్రబాబు తమ విధానం వెల్లడించే అవకాశం ఉంది. గ్రామ కంఠాల సమస్య పైనా రైతులకు చంద్రబాబు స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. అసైన్డ్ ల్యాండ్స్ విషయంలో అమ్ముకునే అవకాశం ఇచ్చినప్పటికీ గత ప్రభుత్వ నిర్ణయంతో సమస్యలు రావటంతో.. ఇప్పుడు పరిష్కారం దిశగా రైతులు ప్రభుత్వం నుంచి హామీ కోరుతున్నారు.
రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల అంశంలోనూ నిర్దిష్ట కాల పరిమితి పైన చంద్రబాబు హామీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. గ్రామాల వారీగా అభివృద్ధికి 20 రోజుల్లో 25 గ్రామాలకు డీపీఆర్ పైన స్పష్టత ఇచ్చే ఛాన్స్ ఉంది. 2026 జూన్ నాటికి గ్రామాల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. రాజధాని నిర్మాణాల పైన ప్రభుత్వ ప్రణాళికలను వివరించటంతో పాటుగా రైతులకు చంద్రబాబు ఇచ్చే హామీల పైన ఆసక్తి నెలకొంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos