ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. కూటమి పార్టీలుగా కొనసాగుతూనే సొంతంగా బలం పెంచుకోవటమే లక్ష్యంగా మూడు పార్టీలు వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు యూరప్ నుంచి తిరుగు ప్రయాణంలో ఢిల్లీకి చేరకోనున్నారు. రేపు మంగళవారం దిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు, జలవనరుల శాఖ మంత్రి, న్యాయశాఖ మంత్రితో సీఎం భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు, ప్రాజెక్టుపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. మే 2వ తేదీన ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనకు రానున్నందున, సీఎం చంద్రబాబు దిల్లీ పర్యటన కీలకం కానుంది. అయితే, అమిత్ షా తో భేటీ వేళ రాజకీయ చర్యలు కీలకంగా మారనున్నాయి.
కేంద్రంలో మంత్రివర్గ విస్తరణ దిశగా కసరత్తు జరుగుతోంది. దీనికి ముందే ఏపీ నుంచి రాజ్యసభకు వైసీపీ మాజీ నేత సాయిరెడ్డి స్థానంలో బీజేపీ ఈ సీటు తీసుకోవాలని నిర్ణయించింది. తమ పార్టీ అభ్యర్ధి గురించి చంద్రబాబుకు షా స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. రాజ్యసభకు సాయిరెడ్డి స్థానంలో తమిళనాడు బీజేపీ నేత అన్నామలైకు అవకాశం ఇస్తారని ఢిల్లీ బీజేపీ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. అన్నామలై ను ఏపీ నుంచి రాజ్యసభకు నామినేట్ చేసి కేంద్ర మంత్రిగా అవకాశం ఇస్తారని తెలుస్తోంది. ఇప్పుడు చంద్రబాబు పర్యటన వేళ ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్ధితో పాటు కేంద్ర మంత్రిగా అవకాశం ఎవరికి ఇవ్వాలని అంశం పైన చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.
ఏపీ నుంచి టీడీపీకి చెందిన ఇద్దరు.. బీజేపీ నుంచి ఒకరు కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు. కాగా, జనసేనకు కేంద్ర మంత్రివర్గంలో అవకాశం దక్కలేదు. ఇప్పుడు విస్తరణ సమయంలో జనసేన నుంచి ఎవరికైనా అవకాశం ఇస్తారా.. లేక, టీడీపీకే మరో సీటు ఛాన్స్ దక్కుతుందా అనేది కీలకం గా మారుతోంది. అయితే, రాజ్యసభకు అన్నామలై ఖాయమైతే ఆయనకే మంత్రి పదవి ఇస్తారని మరో ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ నాయకత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. ఈ క్రమంలో ఏపీ కేంద్రంగా చంద్రబాబు తో చర్చల వేళ బీజేపీ నాయకత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఏం జరుగుతుందో మరి చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos