ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. రేపు గురువారం హస్తిన చేరుకుంటారు. గురువారం రాత్రి ఢిల్లీ చేరుకోనున్న సీఎం చంద్రబాబు... శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు. ఏపీకి పెట్టుబడుల అంశంపై అదే రోజు రాత్రి పలువురు పారిశ్రామికవేత్తలతో కూడా సీఎం సమావేశం అవుతారు. 24వ తేదీన నీతి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఈ పర్యటనలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను చంద్రబాబు కలుస్తారని తెలుస్తోంది. గోదావరి - బనకచర్ల ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ప్రీ-ఫీజుబిలిటీ రిపోర్టును ఆర్థికమంత్రికి అందజేస్తారు. బనకచర్ల పథకానికి అనుమతి ఇవ్వాలని కోరనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆర్థిక సహాయం కోసం ఇప్పటికే చంద్రబాబు రెండుసార్లు ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ ను కలిశారు. అప్పుడు ఆమె డీపీఆర్ ఇవ్వాలని కోరారు. దీంతో ప్రీ-ఫీజుబిలిటీ రిపోర్టును - పీఎస్ఆర్ ను సిద్ధం చేయాలని చంద్రబాబు జలవనరుల శాఖను ఆదేశించారు. జలవనరుల శాఖ ఆ రిపోర్టును చేసింది.
చంద్రబాబు కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ, వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషిని కూడా కలుస్తారు. ఆ తర్వాత కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్, కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్, కేంద్ర శాస్త్ర సాంకేతిక, సిబ్బంది వ్యవహారాల సహాయ మంత్రి జితేంద్రసింగ్తో సమావేశమవుతారు. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్తో సీఎం చంద్రబాబు భేటీ అవుతారని చెబుతున్నారు. మరోవైపు చంద్రబాబు ఇవాళ చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటిస్తున్నారు. ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా సాయంత్రం ఆయన కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం తిరిగి అమరావతి చేరుకుంటారు. మొత్తానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. మంత్రి లోకేష్ కూడా ఇటీవల కుటుంబసమేతంగా ఢిల్లి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన సంగతి తెలిసిందే.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos